ఎన్నికల నేపథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోదీ
డెహ్రాడూన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరాఖండ్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్త అనుసంధాన ‘మహాయజ్ఞ’ కార్యక్రమం కింద రూ.18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇక్కడ పరేడ్ గ్రౌండ్ వద్ద ఒక ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, ‘మహాయజ్ఞ’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు మేము డబుల్ట్రిఫుల్ వేగంతో పనులు చేస్తున్నాం’ అని తెలిపారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు ఈ దశాబ్దంలో ఉత్తరాఖండ్ను మార్చడానికి దోహదపడతాయని కేదార్నాథ్లో తాను చెప్పిన విషయాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. కేదార్నాథ్లో తమ ప్రభుత్వం చేపట్టిన పునర్నిర్మాణ పనుల వల్ల 2019లో ఈ హిమాలయ ఆలయానికి 10 లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారని చెప్పారు. ఉత్తరాఖండ్లో శనివారం శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులు దాదాపు అన్ని రంగాలను కవర్ చేశాయని, దిల్లీ
డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ కూడా ఇందులో ఉందని అన్నారు. అలాగే దేశానికి చెందిన అతిపెద్ద ఎలివేటెడ్ వైల్డ్లైఫ్ కారిడార్, చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ ప్రాజెక్టుల, రిషికేశ్లో లక్ష్మణ్ జూలాకు ఒక కొత్త వంతెన ఉన్నాయి. ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ అభివృద్ధికి గత ప్రభుత్వాలు కృషి చేయలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏడున్నరేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.12 వేల కోట్లను వ్యయం చేసిందని తెలిపారు. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్లో ఎన్నికలు జరగనున్నాయి.