తమ ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీ రాష్ట్రంలో సభ నిర్వహిస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఏపీలో ఆ పార్టీ లేదన్నారు. రాజకీయ పార్టీ కాబట్టి బహిరంగ సభ నిర్వహించుకుంటోందన్నారు. విజయవాడలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తాపత్రయపడుతూ బీజేపీ ఈ రోజు సభ నిర్వహిస్తోందన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై నీతి ఆయోగ్ వచ్చి ర్యాంకు ఇచ్చిందని… దానికి బీజేపీ సమాధానం చెప్పాలని అన్నారు. విభజన హామీలు ఎంతమేరకు నెరవేర్చిందో బీజేపీ చూసుకోవాలని హితవుపలికారు. ఓటీఎస్ నిర్బంధమైన పథకం కాదు… స్వచ్చంధమని స్పష్టం చేశారు. ప్రజల కోరిక మేరకే ఓటీఎస్ పథకం తీసుకొచ్చామన్నారు. రూపాయి ఇస్తాం అంటున్న వాళ్ళు.. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారని ప్రశ్నించారు.