వెస్ట్బ్యాంక్లో పలస్తీనియన్ల భారీ ర్యాలీ ` గాజాకు మద్దతు కోసం డిమాండ్
గాజా : గాజా స్ట్రిప్లో ఇజ్రాయిల్ సైనిక చర్యలను నిరసిస్తూ, గాజాకు సాయాన్ని మరింత పెంచాలని డిమాండ్ చేస్తూ వెస్ట్బ్యాంక్లో వేలాది మంది పలస్తీనియన్లు వీధుల్లోకి వచ్చారు. భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పలస్తీనా జెండాలు, పౌష్టికాహార లోపంతో భాపడే గాజా ప్రజల చిత్రాలు ప్రదర్శిస్తూ కదం తొక్కారు. తమ గళం ప్రపంచానికి వినిపిస్తామన్నారు. మధ్య రమల్లాలోని అల్ మనారా స్క్వేర్ వద్దకు చేరుకొని ప్రదర్శన నిర్వహించారు. నబ్లస్, తుబాస్, ఖల్విల్యా, సల్ఫీట్, జెనిన్, హెబ్రాన్లో ఆందోళనలు జరిగాయి. యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, ఆంక్షలు ఎత్తివేయాలని, మానవతా సహాయానికి అనుమతి ఇవ్వాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేశారు.
ఇజ్రాయిల్ దాష్టీకాలకు అద్దంపట్టే విధంగా ఆకలితో పిల్లలు అల్లాడుతుండటాన్ని కళ్లకు కట్టేలా అస్థిపంజరాలను పోలిస దుస్తులతో, శవాలను మోసుకెళుతున్నట్లుగా చిత్రీకరిస్తూ నిరసన తెలిపారు. ఇజ్రాయిల్ తీరును తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. సహాయ సామగ్రితో వేల సంఖ్యలో ఉన్న ట్రక్కులను అనుమతించకుండా గాజా ప్రజలను పస్తులుంచి చంపుతున్నారని ఆరోపించారు. పలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని నిర్ణయించిన ప్రపంచ దేశాల్లో ఇందుకు జాప్యం చేయకుండా, ఆంక్షలు విధించకుండా ముందుకెళ్లాలని ఫత్హా సెంట్రల్ కమిటీ ఉప ప్రధాన కార్యదర్శి సబ్రీ సైదమ్ కోరారు. తమ ఆత్మగౌరవం, మాతృభూమి ప్రతిష్ఠ, స్వాతంత్య్రం, స్వేచ్ఛ జీవితం కంటే పలస్తీనియన్లకు ఒక సంచి గోదుమ పిండి, ఆహారం ఎక్కువ విలువైనది కాదని నొక్కిచెప్పారు. స్వాతంత్య్ర`సార్వభౌమ పలస్తీనా సాధనకు పోరు మరింత బలోపేతం కావాలని పలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది.


