కొండ చీలికలో చిక్కుకున్న ట్రెక్కర్..కాపాడిన ఆర్మీ
కేరళలో మలప్పుజ సమీపంలో రెండు రోజులుగా కొండ చీలికలో చిక్కుకుపోయిన కేరళ యువకుడి కథ సుఖాంతమైంది. ఆర్మీ సాయంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా చేరాడు సమీపంలో చేరాట్ కొండలున్నాయి. వీటిని అధిరోహించాలనుకుని ఆర్.బాబు (23) అనే యువకుడు, తన స్నేహితులతో కలసి గత సోమవారం వెళ్లాడు. కష్టంగా అనిపించడంతో ఇద్దరు స్నేహితులు తమ ప్రయత్నాలను మధ్యలోనే విరమించుకున్నారు. బాబు మాత్రం విజయవంతంగా శిఖరం వరకు చేరుకున్నాడు. అయితే ఉన్నట్టుండి కిందకి జారి, కొండ చీలిక వద్ద చిక్కుకుపోయాడు. ఈ విషయం అతడి స్నేహితుల ద్వారా అధికారులకు తెలిసింది. వెంటనే సహాయక బృందాలు చర్యలు చేపట్టినప్పటికీ అతని వరకూ చేరుకోలేకపోయాయి. దీంతో గత రెండు రోజులుగా ఆహారం, నీరు లేకుండా అతను అక్కడే ఒంటరిగా గడపాల్సి వచ్చింది. పరిస్థితిని గమనించిన సీఎం పినరయి విజయన్ స్వయంగా ఆర్మీ సాయాన్ని కోరారు.దీంతో బుధవారం ఉదయానికి రెండు ఆర్మీ బృందాలు చేరాట్ కొండ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇందులో ఒకటి మద్రాస్ రెజిమెంట్ కు చెందిన బృందం. ఇందులో పర్వతాల అధిరోహణలో నైపుణ్యం కలిగిన సైనికులు ఉన్నారు. అలాగే, బెంగళూరు నుంచి పారాచ్యూట్ రెజిమెంట్ కు చెందిన 22 మంది సైనికుల బృందం అన్ని రకాల ఎక్విప్ మెంట్ తో చేరుకుంది.. సహాయ కార్యక్రమాలు బుధవారం ఉదయం 5.45 గంటలకు మొదలయ్యాయి. డ్రోన్ల సాయంతో బాబు జాడను గుర్తించారు. తొలుత అతడికి ఆహారం, నీరు అందించారు. అనంతరం అక్కడి నుంచి క్షేమంగా కిందకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన చిత్రాలను సదరన్ కమాండ్ ట్విట్టర్లో షేర్ చేసింది. సుశిక్షితులైన తమ బృంద సభ్యులు యువకుడిని రక్షించాయని ప్రశంసించింది.