న్యూదిల్లీ: మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశంలో రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరిగాయి. ముగిసిన ఆర్థికసంవత్సరంలో ఆదాయం, ఇతర ప్రత్యక్ష పన్నులతోపాటు పరోక్ష పన్నులు కూడా కలుపుకుని రూ.27.07లక్షల కోట్లు రాబట్టినట్టు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 వరకు స్థూల పన్ను వసూళ్లు రూ. 27.07 లక్షల కోట్లు కాగా, బడ్జెట్ అంచనా రూ. 22.17 లక్షల కోట్లు అని ఆయన చెప్పారు. ప్రత్యక్ష పన్నులు, వ్యక్తులు చెల్లించే ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను మొత్తం కలిపి రూ. 14.10 లక్షల కోట్లుకాగా, ఇది బడ్జెట్ అంచనా కంటే రూ.3.02 లక్షల కోట్లు ఎక్కువని ఆయన పేర్కొన్నారు. ఇక ఎక్సైజ్ సుంకం వంటి పరోక్ష పన్నులు గత బెడ్జెతో పోల్చుకుంటే రూ.1.88 కోట్లు ఎక్కువ. బడ్జెట్ అంచనా రూ.11.02 లక్షల కోట్లు కన్నా పరోక్ష పన్నులు మొత్తం కలిపి రూ.12.90 లక్షల కోట్లు వసూలైనట్టు ఆయన వివరించారు.