ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను రెండోరోజు కూడా సస్పెండ్ చేశారు. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. స్పీకర్ చెప్పినా వెనక్కు తగ్గకుండా నిరసన చేపట్టారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం వీరిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇటు మొదటి రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా సభలో అదే పరిస్థితి కనిపించింది. ఉదయం సభ ప్రారంభంకాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం టీడీపీ నిత్యావసరాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేశారు. నినాదాలతో మంత్రులు, స్పీకర్ ప్రసంగాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.టీడీపీ సభ్యుల తీరులో మార్పు రాకపోవడంతో సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. సభా కార్యక్రమాలకు పదే పదే ఆటకం కల్గిస్తుండటంతో ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజు మాత్రమే వీరిని సభ నుంచి సస్పెండ్ చేశారు. శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు కాగా.. మళ్లీ తిరిగి సోమవారం ప్రారంభమవుతుంది. టీడీపీ సభ్యులు మళ్లీ సోమవారం సభకు హాజరుకానున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టింది. సభ ముందుకు సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ బిల్లు, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, పంచాయితీ రాజ్ సవరణ బిల్లు.. ఇతరాలు వచ్చాయి. అలాగే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పైనా కొనసాగుతున్న స్వల్ప చర్చ జరిగింది.