విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రతి ఇంటికి శుద్ధ జలం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీడీఓ కొండన్న తెలిపారు. ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీపీ సబ్బర హేమలత, ఈఓఆర్ డి సత్యబాబు, రైజెస్ ఎన్జీఓ డైరెక్టర్ నారాయణరెడ్డితో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. 2024 లోపు ప్రతి ఇంటికి కొళాయి వేయించి తాగునీరు అందించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు నీటి వల్ల కలిగే వ్యాధులను నివారించేందుకు ఈ శుద్ధ జలం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు. గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో నీరు వృథాకాకుండా పొదుపు చేసేందుకు ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. రోజువారి ప్రతి వ్యక్తికి 55 లీటర్ల తాగునీరు అవసరమని ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవశ్యకత ఉందన్నారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా పారిశుద్ధంపై కూడా శ్రద్ధ తీసుకునేందుకు ఈ కమిటీ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఐఈసీ ఎక్స్పర్ట్ శ్రీనివాసులు, సోషల్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ ఓబులపతి పాల్గొన్నారు.