Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సీఈవోగా తప్పుకోవాలా?.. ట్విట్టర్‌ లో మస్క్‌ కొత్త పోల్‌

సోమవారం ఉదయం వరకు 56% మంది మస్క్‌ తప్పుకోవడమే మేలని ఓటు
ట్విట్టర్‌ను తన అధీనంలోకి తీసుకున్న తర్వాత ఎలాన్‌ మస్క్‌ చేసిన మార్పులు సంచలనం సృష్టించాయి. బ్లూటిక్‌ చార్జ్‌ పెంచడం వంటి నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తాయి. సంస్థ ఉద్యోగులను బయటకు సాగనంపిన వైనంపైనా మస్క్‌ విమర్శలను ఎదుర్కొన్నారు. గతంలో ట్విట్టర్‌ బ్యాన్‌ చేసిన వ్యక్తులను తిరిగి ఆహ్వానించడంపై మస్క్‌ ట్విట్టర్‌ లో పోల్‌ నిర్వహించి, వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పైన ట్విట్టర్‌ నిషేధం ఎత్తివేత కూడా ఇందులో భాగంగా తీసుకున్న నిర్ణయమే.తాజాగా ఎలాన్‌ మస్క్‌ మరోసారి ట్విట్టర్‌ లో పోల్‌ చేపట్టారు. ట్విట్టర్‌ కొత్త బాస్‌ గా తాను తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తడంతో తనపైనే ఈ పోల్‌ నిర్వహించుకుంటున్నారు. ట్విట్టర్‌ బాస్‌ స్థానంలో నుంచి తాను తప్పుకోవాలా? వద్దా? అని ట్విట్టర్‌ యూజర్లను అడిగారు. పోల్‌ లో వెల్లడైన అభిప్రాయానికి తాను కట్టుబడి ఉంటానని.. సీఈవో పోస్ట్‌ నుంచి మీరు తప్పుకోమంటే తప్పుకుంటానని మస్క్‌ ప్రకటించారు. సోమవారం ఉదయం వరకు ఈ పోల్‌ లో 56 శాతం మంది మస్క్‌ ను తప్పుకోవాలంటూ ఓటేయగా.. మిగతా 44 శాతం మంది ట్విట్టర్‌ యూజర్లు మాత్రం సంస్థ సీఈవోగా మస్క్‌ కొనసాగాలని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img