విశాలాంధ్ర-ఆదోని : ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థిని విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వైకాపా ఆదోని నియోజకవర్గం ఇంచార్జ్ యువ నాయకుడు జయ మనోజ్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా స్థానిక అక్షర శ్రీ పాఠశాలలో జరిగిన ఆదోని జోనల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బుధవారం బహుమతులు అందజేశారు. ముందుగా సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా చిన్నారితో కేకే కట్ చేయించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా జయ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు క్రీడ పోటీలు నిర్వహించాలని, ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు అన్నివేళలా వారికి సహాయ సహకారాలు అందించేందుకు ముందు ఉంటానని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు నేడు, అమ్మ ఒడి పథకం, వసతి దీవెన, నాణ్యమైన భోజనం లాంటి సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో విద్యార్థులకు ప్రేమ,ఆప్యాయతలు పంచే మామగా ఉండడం మన అదృష్టమని అన్నారు. ఆదోని నుండి క్రికెట్లో ప్రతిభ కనబరిచి దేశ మహిళా క్రికెట్ జట్టులో స్థానం సంపాదించిన అంజలి శర్వానిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని చేరుకోవాలని, కష్టాల్లో ఉన్నటువంటి క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షుడు సన్నీ, అక్షర శ్రీ పాఠశాల యాజమాన్య సభ్యులు సుధాకర్ రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, కిడ్డీస్ పాఠశాల కరస్పాండెంట్ నారాయణరెడ్డి, శ్రీవిద్య పాఠశాల డైరెక్టర్ వినోద్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.