ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింక చలపతి.. నియోజకవర్గ కార్యదర్శి మధు
విశాలాంధ్ర – ధర్మవరం : నేడు ప్రభుత్వం చేపడుతున్న జగనన్న ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింక చలపతి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో జనవరి 17 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరిగే సిపిఐ పోరుబాట పత్రికలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న కాలనీలకు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 1,80,000 ఏమాత్రం సరిపోదని, లబ్ధిదారులు అప్పులు చేసుకొని, ఇంటి నిర్మాణాలు చేపడుతూ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా టిట్కో ఇళ్ల నిర్మాణాలు కూడా తొందరగా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో ఈనెల 18వ తేదీ నుండి ఫిబ్రవరి 22 వరకు సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 6న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, ఫిబ్రవరి 22న విజయవాడలో రాష్ట్రస్థాయి మహాధర్నా జరుగుతుంది అన్నారు. అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వెంకటస్వామి, కార్యదర్శి వెంకటనారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య, నాయకులు భుజంగం, శ్రీధర్, సురేష్, మల్లికార్జున, శ్రీనివాసులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.