బెంగళూరు : సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘కాంతార’ అప్డేట్ వచ్చేసింది. ‘కాంతార’కు పార్ట్-2 రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ‘కాంతార’ కొనసాగింపుపై స్పందిం చారు. ‘కాంతార-2’కు మేం ప్రణాళికలు సిద్ధం చేశాం. రిషబ్శెట్టి ఇప్పటికే సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. జూన్లో షూట్ మొదలయ్యే అవకాశం ఉంది. సినిమాలోని కొన్ని సీన్స్ వర్షాకాలం నేపథ్యంలో ఉండనున్నాయి. అందుకే ఆ నెల నుంచి చిత్రీకరణ మొదలు పెట్టాలనుకుంటున్నాం. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ లేదా మేలో దీన్ని విడుదల చేయనున్నాం. అయితే ఇది ‘కాంతార’కు సీక్వెల్ కాదు ప్రీక్వెల్’’ అని విజయ్ వివరించారు. రిషబ్శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంతటా మంచి కలెక్షన్స్ రాబట్టింది.