సీపీఐ, సీపీిఎం డిమాండ్
విశాలాంధ్ర – విశాఖ : ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీి) పేరుతో పూర్ణామార్కెట్, ముడసర్లోవ భూములను వైసీపీ అనుయాయులకు అప్పగించే ప్రతిపాదనలు తక్షణమే విరమించుకోవాలని జీవీఎంసీ పాలకవర్గాన్ని సీపీఐ, సీపీఎం డిమాండ్ చేశాయి. ప్రజల ఆస్తులను పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీిఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ప్రతిపాదనలు తక్షణం ఉపసంహరించుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎం.పైడిరాజు, ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ, బుధవారం జరిగే జీవీఎంసీ కౌన్సిల్లో పాలకవర్గ నిర్ణయాలను అన్ని రాజకీయపార్టీల కార్పొరేటర్లు ముక్తకంఠంతో వ్యతిరేకించి ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ ఆస్తులను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీి) పేరుతో ప్రభుత్వ పెద్దలు కాజేయాలని కుట్రపన్నారన్నారు. అందులో భాగంగానే సర్ధార్ వల్లభాయ్ పటేల్ (పూర్ణామార్కెట్), ముడసర్లోవ పార్కులకు చెందిన 283 ఎకరాలు భూములను పీపీపీ క్రింద ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని కౌన్సిల్లో ఎజెండా పెట్టి తీర్మానం చేయబోతున్నారన్నారు. దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే యూజర్ ఛార్జీల పేరుతో ప్రజలపై అన్యాయంగా వేసిన చెత్త, ఆస్తి పన్నులు రద్దు చేయాలని కోరారు. జీ20 దేశాల గ్లోబల్ సమ్మిట్ పనులకు జీవీఎంసీ నుంచి 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయించే ప్రతిపాదనలు విరమించాలన్నారు. విశాఖ ప్రజల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ కార్యవర్గ సభ్యులు ఎస్.కె.రెహ్మన్, పి చంద్రశేఖర్, జి రాంబాబు, సీపీిఎం 78వవార్డు కార్పొరేటర్ బి.గంగారావు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్కేఎస్వీ కుమార్, సీపీఐ, సీపీఎం నాయకులు ఎం.సుబ్బారావు, పి.మణి, బి.వెంకట్రావు, ఎస్ మురళి, ఎం ఎ బేగం, ఎ దేముడమ్మ, జి జయ, ఎన్ నాగభూషణం, ఎం శ్రీనివాసరావు, వి నల్లయ్య తదితరులు పాల్గొన్నారు.