టాటా గ్రూప్కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా టెవోల్డే గెబ్రెమారియం బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు సీఈఓగా ఉన్న క్యాంప్బెల్ విల్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ సోమవారం ఉద్యోగులతో టౌన్హాల్ సమావేశం నిర్వహించి గెబ్రెమారియంను సంస్థకు పరిచయం చేశారు.
ఎయిర్ ఇండియా పరివర్తన ప్రయాణంలో కొత్త అధ్యాయానికి ఇది నాంది అని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని కొత్త సీఈఓకు స్వాగతం పలికారు.
సాంకేతిక సామర్థ్యాలపై దృష్టి
గెబ్రెమారియంకు విమానయాన రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ చీఫ్గా పనిచేశారు. ముఖ్యంగా సంస్థల నిర్వహణ, ఇంజినీరింగ్, ఆపరేషనల్ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఆయనకు అనుభవం ఉంది. ఎయిర్ ఇండియా తన విమానాల సంఖ్యను భారీగా పెంచుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. సంస్థ సాంకేతిక విభాగాన్ని మరింత పటిష్ఠం చేయడం, విమానాల నిర్వహణ (వీaఱఅtవఅaఅcవ) వ్యవస్థలను మెరుగుపరచడంపై గెబ్రెమారియం ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా భద్రతా ప్రమాణాలు, కార్యకలాపాల విశ్వసనీయత, ఆర్థిక పనితీరును మెరుగుపరచాల్సిన ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సీఈఓ బాధ్యతలు చేపట్టడం కీలకంగా మారింది.
తొలినాళ్లలో సీనియర్ల మార్గదర్శనం
గెబ్రెమారియం బాధ్యతలు చేపట్టిన తొలి కొన్ని నెలల్లో ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, సంస్థ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ ఖరోలా మార్గదర్శనం చేయనున్నారు. ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తుతం సవాళ్లతో ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.26,000 కోట్లకు పైగా నష్టం నమోదైంది. ఈ పరిస్థితుల్లో సంస్థను బలోపేతం చేసేందుకు యజమానులైన టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి మరో రూ.10,000 కోట్ల తాజా ఈక్విటీ పెట్టుబడిని సమీకరించాలని ఎయిర్ ఇండియా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ సంస్థ భద్రత, ఆర్థిక స్థిరత్వం, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో గెబ్రెమారియంకు గణనీయమైన స్వేచ్ఛ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


