Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అవినాశ్‌రెడ్డికి ఎదురుదెబ్బ

సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

విశాలాంధ్ర`హైదరాబాద్‌: మాజీమంత్రి వివేకానందారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అవినాశ్‌రెడ్డి తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి స్పష్టంచేసింది. విచారణను ఆడియో, వీడియో రికార్టు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని స్పష్టంచేస్తూ.. అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ తన వాంగ్మూలాన్ని నమోదు చేస్తోందని, తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ అవినాశ్‌రెడ్డి వారం క్రితం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అంతేగాకుండా తనను విచారిస్తున్నప్పుడు ఆడియో, వీడియోల ద్వారా రికార్డు చేయకపోవడాన్ని సవాలు చేశారు. జనవరి 28, ఫిబ్రవరి 24న సీబీఐ సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు ఆడియో, వీడియో రికార్డు చేయాలని అభ్యర్థించినా చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలని కోరారు. విచారణ సందర్భంగా తన న్యాయవాదిని కూడా అనుమతించాలని కోరారు. తన వాంగ్మూలానికి సంబంధించిన ప్రతులను అందజేసేలా దర్యాప్తు అధికారిని ఆదేశించాలన్నారు. తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని, వీటి ప్రకారం వివేక హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అవినాశ్‌రెడ్డి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img