పశ్చిమలో రామగోపాల్ రెడ్డి విజయం
విశాలాంధ్ర – అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం (కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అనంతపురము నగరంలోని జేఎన్టీయూ కళాశాలలో గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించగా శనివారం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కలేదు. ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు. ఈ కౌంటింగ్లో భూమిరెడ్డి రామగోపాల్రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా, వెన్నపూస రవీంద్రరెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయని తెలిపారు. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన అనంతరం భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపుని ప్రకటించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.