అఫ్గానిస్థాన్లో తాలిబన్ల అరాచకం
భయం, భయంగా గడుపుతున్న ప్రజలు
మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు
కాబుల్ : తాలిబన్ల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. వాటిని తట్టుకోలేక అఫ్గాన్ ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. రోడ్ల మీదకు వాహనాలు వస్తున్న శబ్ధం వింటే చాలు హడలిపోతున్నారు. దేశం విడిచి వెళ్లిపోయేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజల్ని హింసించిన వారు తమవారైనా చర్యలు తీసుకుంటామన్న తాలిబన్ల హామీ నీటిమూటగా మిగిలింది. ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న దారుణాలను చూస్తుంటే అఫ్గాన్లో పరిస్థితులు మున్ముందు మరింత దిగజారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాబూల్ నుంచి అమెరికన్ల తరలింపు చరిత్రలోనే క్లిష్టప్రక్రియని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ ప్రక్రియ ఫలితం చివరకు ఎలా ఉంటుందో తాను హామీ ఇవ్వలేనన్నారు. శ్వేతసౌథం నుంచి టీవీ ద్వారా ప్రసంగించిన ఆయన ఎలాంటి హామీని తను ఇవ్వలేనని, ప్రతి అమెరికన్ తరలింపునకు చేయగలిగినదంతా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర భారతీయులు సహా 150 మందిని తాలిబన్లు అపహరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అఫ్గాన్ నుంచి వేర్వేరు దేశాలకు వెళ్లే వారిని తాలిబన్లు నిర్బంధించినట్లు తెలిపింది. కొందరు భారతీయులను తాలిబన్లు అపహరించినట్లు అఫ్గాన్ సీనియర్ జర్నలిస్టులు సైతం ట్వీట్లు చేరారు. దీంతో అపహరణకు గురైన వారి భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయింది. ఇదిలావుంటే తాము అసలు భారతీయు లను అపహరించలేదని తాలిబన్లు ప్రకటించారు. స్త్రీల హక్కులను గౌరవిస్తామని, వారినీ పనిచేసుకు నేందుకు అనుమతిస్తామన్న తాలిబన్ల హామీ కేవలం మాటలకే పరిమితమవుతోంది. మునుపటి స్వభావానికి భిన్నంగా వారేమీ ప్రవర్తించడం లేదనే వాదనలకు బలం చేకూరుస్తూ వారి క్రూరత్వాన్ని చాటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అఫ్గానిస్థాన్కు చెందిన నజ్లా ఆయూబీ అనే మాజీ న్యాయమూర్తి వారి దారుణాలను వెలుగులోకి తెచ్చారు. అమెరికాలో నివాసముం టున్న ఆమె ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్గాన్లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను బయటపెట్టారు. తమకు సరిగ్గా వండిపెట్టలేదన్న కారణంతో ఉత్తర అఫ్గానిస్థాన్కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి ఆమెకు నిప్పు పెట్టారని ఆయూబీ తెలిపారు. తాలిబన్ ఫైటర్లకు వండిపెట్టాలని అక్కడి ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. స్థానిక యువతులను చెక్కపెట్టెల్లో బంధించి సెక్స్ బానిసలుగా మార్చేందుకు కొన్ని వారాలుగా ఇతరప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. ఒక పక్క
ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ మహిళలు స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని ఇంకో వైపు హామీలు ఇస్తున్నారని ఆయూబీ చెప్పారు. మహిళల హక్కుల కోసం పోరాడే తనలాంటి వారు తాలిబన్ల పాలనలో జీవించడం కష్టమన్న ఉద్దేశంతోనే తాను పారిపోయి వచ్చినట్లు చెప్పారు. తమను కార్యాలయాలకు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారంటూ ఇప్పటికే అనేక మంది మహిళా జర్నలిస్టులు ప్రపంచానికి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
అఫ్గాన్లో కో`ఎడ్యుకేషన్పై నిషేధం
అఫ్గానిస్తాన్లో తాలిబన్లు మహిళలపై ఉక్కు పాదం మోపారు. షరియత్ చట్టం పేరుతో అరాచక చర్యలను ఆరంభించారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కో-ఎడ్యుకేషన్ విధానాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసిన కొన్ని రోజులకే తాలిబన్ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఆడ, మగ పిల్లలు కలిసి చదువుకోవడాన్ని నిషేధించారు. ‘సమాజంలోని అన్ని దుర్మార్గాలకు అదే మూలం’ అని పేర్కొన్నారు. వర్సిటీ ప్రొఫెసర్లు, ప్రైవేట్ సంస్థల యజమానులు తాలిబన్ అధికారుల మధ్య సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖామా ప్రెస్ న్యూస్ ఏజెన్సీ శనివారం నివేదించింది. అఫ్గాన్ ఉన్నత విద్యకు చెందిన తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడు గంటలపాటు ఈ సమావేశాన్ని నిర్వహించారు. కో-ఎడ్యుకేషన్ను నిలిపివేయాల్సిందేనని, వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. అలాగే మహిళా అధ్యాపకులు కేవలం మహిళా విద్యార్థులకు మాత్రమే బోధించడానికి అనుమతి ఉంటుందని, పురుషులకు బోధించే అవకాశం ఉండదని కూడా స్పష్టం చేశారు. కాగా గత రెండు దశాబ్దాలలో అఫ్గాన్లోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఇనిస్టిట్యూట్లలో కో-ఎడ్యుకేషన్, జెండర్ బేస్డ్ ప్రత్యేక తరగతుల మిశ్రమ వ్యవస్థను అమలు చేసింది. అధికారిక అంచనాల ప్రకారం హెరాత్లో ప్రైవేట్, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 40 వేల మంది విద్యార్థులు, 2 వేల మంది అధ్యాపకులు ఉన్నారు.