ఐసీజీఎస్ విగ్రహ నౌక ప్రారంభోత్సవంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
మన దేశంలోని పరిశ్రమలు ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు తగిన విధానాలను ప్రభుత్వం ఇప్పటికే తీసుకొచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేడు మన సామర్థ్యాలను పరిపూర్ణంగా ఉపయోగించుకుని, ప్రభుత్వ విధానాల ప్రయోజనాన్ని పొందుతూ, దేశీయ నౌకా నిర్మాణ ప్రధాన కేంద్రంగా మన దేశాన్ని తీర్చిదిద్దేందుకు గొప్ప అవకాశం ఉందని చెప్పారు.అడ్వాన్స్డ్ ఫైర్ పవర్తో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్ ‘విగ్రహ। నౌక ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసిన ఏఎల్హెచ్ (అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్)ను కూడా ఈ నౌకపై ఉపయోగించవచ్చునని తెలిపారు. ప్రభుత్వం, కోస్ట్ గార్డ్, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసికట్టుగా మన దేశ సమగ్రత, సార్వభౌమాధికారాలను ఏ విధంగా కాపాడగలవో చెప్పడానికి ఉదాహరణ ఇది అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ‘విగ్రహ’ అనే పదానికి మన గ్రంథాల్లో సొగసైన అర్థాలు ఉన్నాయన్నారు. ‘బంధాల నుంచి విముక్తి’ అని ఒక అర్థం, అలాగే ‘ఒకరి కర్తవ్యం, బాధ్యతలకు కట్టుబడి ఉండటం’ అనే అర్థం కూడా ఉందని చెప్పారు. ఈ ‘విగ్రహ’ పూర్తిగా అన్ని రకాల సవాళ్ళ సంకెళ్ళ నుంచి స్వేచ్ఛగా ఉంటుందని, దేశం పట్ల సేవ, కర్తవ్యాల ప్రత్యేక బంధాలను కలిగి ఉంటుందని తన దృఢ విశ్వాసమని తెలిపారు.