Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

స్ఫుటమయిన చరిత్రాత్మ స్వరం!

‘‘తన చరిత్ర తనె పఠించి ఫక్కున నవ్వింది ధరణి
తన గాథను తనె స్మరించి భోరున ఏడ్చింది ధరణి’’ అంటూ ాసామాన్యంగా కవులు పట్టించుకోనిా ఓ చారిత్రక విరోధాభాస (నఱర్‌శీతీఱషaశ్రీ Iతీశీఅవ)ని ఎత్తి చూపించారు ఆవంత్స సోమసుందర్‌. చరిత్రలో అంతా మంచే జరిగిందనలేం ా అలాగే, చరిత్రలో విషాదాలు జరగనే లేదని బుకాయించనూ లేం! ‘‘ధరణీ చక్రం గిరగిర తిరుగుతోంది తిరుగుతోం’’ దంటూనే ‘‘వృద్ధ జగత్సమాధిపై సమధర్మం ప్రభవించును’’ అని తీర్పు చెప్పాలంటే చరిత్రపట్ల సమగ్రమైన అవగాహన ఉండాలి మరి! అలాంటి సమగ్రమైన అవగాహన సాహిత్యం పట్ల కూడా లేకపోతే, ‘‘వజ్రాయుధం’’లాంటి చారిత్రక కావ్యం రాయడం సాధ్యం కాదు! పందొమ్మిది వందల ఇరవై దశకంలో పుట్టడం వల్లనే సోమ సుందర్‌కి అంతటి చారిత్రక అవగాహన ఏర్పడిరదేమో అనిపిస్తుంది. ఇరవై దశకంలో పుట్టిన తరం, రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ‘శాండ్విచ్‌’ అయిపోయిన మాట ఎంతటి చారిత్రక సత్యమో, అదే కారణం చేతనే చారిత్రక పరిణామం పట్ల సమ్యగవగాహన సాధించుకున్న మాట కూడా అంతే వాస్తవం మరి! భావకవిత్వం ప్రబలమయిన సాహిత్య ధోరణిగా వెలుగొందుతూ ఉన్న దశలో ఈ తరం కవులు కలం పట్టారు. తొలితరం అభ్యుదయ రచయితలుగా ప్రగతిశీల సాహిత్య ధోరణికి రూపురేఖలు దిద్దారు. ప్రజాఉద్యమాలనే పతాకంగా ధరించడానికిగానీ, ప్రజా శత్రువులను ఉతికి ఆరేయడానికి గానీ ఈతరం రచయితలు ఏమాత్రం జంకకపోవడం వారి విశిష్ట లక్షణం. భావకవుల ‘కారుణ్యం’ స్థానంలో అధిక్షేపం, వ్యంగ్యం, ధీరం, ధిక్కార రసాలను ప్రతిష్ఠింపచేసినవాళ్ళు ఈ తరం కవులే! అందుకే రాంభట్ల, మల్లారెడ్డి, దాశరథి, ఆరుద్ర, బొల్లిముంత, నయాగరా కవిత్రయం, అనిసెట్టి, గంగినేని తదితరుల సరసన ఆవంత్స సోమసుందర్‌కు కూడా పీటవేసి కూర్చోపెడుతోంది సాహిత్య చరిత్ర. ఇక్కడ చెప్పుకున్న కవులూ రచయితలందరి కన్నా ఎక్కువ రాశారు సోమసుందర్‌. కవిత్వం, కథ, రూపకం, విమర్శ, పత్రిక నిర్వహణ, ప్రచురణాలయ నిర్వహణ, ప్రెస్‌ నిర్వహణ తదితర రంగాల్లో సోమ సుందర్‌ బహుముఖంగా కృషి చేశారు. అన్నిటినీ మించి, సామాజిక, రాజకీయ రంగాల్లో కూడా సోమసుందర్‌ కృషి చేశారు. సాహిత్య ప్రక్రియల వరకూ పరిమితమయి చూసినా, సోమసుందర్‌ ‘‘అవుట్‌పుట్‌’’ బహుశా మిగిలిన వాళ్ళందరినీ మించిపోతుంది. రాంభట్ల మల్లారెడ్డిబొల్లిముంత తదితరులతో కలిపి చెప్పుకున్నా, సోమసుందర్‌ విశిష్టత గురించి వేరే నొక్కి చెప్పాల్సిందే! ఆయన నిర్వహించిన ‘కళాకేళి’ పత్రిక భావకవుల మార్దవానికీ, అభ్యుదయ కవుల నైశిత్యానికీ వారధిగా నిలిచే ప్రయత్నంచేసింది. అలాగని, ‘కళాకేళి’ పత్రిక ప్రగతిశీల స్వభావానికి కొరవేమీలేదు బహుశా 1968లో కాబోలు, కార్ల్‌ మార్క్‌ ్స 150వ జయంతి సందర్భంగా అని గుర్తు, ‘కళాకేళి’ ఓ ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ‘యంగ్‌ మార్క్‌ ్స’ ముఖచిత్రంతో వెలువడిన ఆ సంచికలో, కవిగా మార్క్‌ ్స గురించి ఓ వ్యాసం కూడా చదివిన గుర్తుంది!
అభ్యుదయ కవుల విశిష్ట లక్షణాల్లో, చరిత్రతో తమ సాహిత్యాన్ని ముడిపెట్టడం ముఖ్యమైందనిపిస్తుంది. ఇది సోమసుందర్‌లోనూ విస్తృతంగానే కనిపిస్తుంది.1949లో వచ్చిన అభ్యుదయ కవితా సంకలనాలు ‘వజ్రాయుధం’, ‘త్వమేవాహం’, ‘అగ్నివీణ’, ‘అగ్నిధార’ నాలుగింటిలోనూ, ఓ సామాన్య లక్షణం స్ఫుటంగా కనిపిస్తుంది. వాటన్నిటిలోనూ చారిత్రక పరిణామాలు ఇతి వృత్తాలుగా తీసుకుని రాసిన కవితలే ప్రాముఖ్యం వహించడం గమనార్హం. ఇదేదో అభ్యుదయ సాహిత్యంతోనే మొదలయిన ధోరణి కాదు! చరిత్రకూ, సాహిత్యానికీ మధ్య వున్న సంబంధం వేల సంవత్సరాలుగా రచయితలు గుర్తించిన విషయమే! అందుకేనేమో భవభూతి ‘ఉత్తర రామచరితం’ నుంచి, తులసీదాసు ‘రామ చరిత మానసం’ వరకూ రచనల శీర్షికల్లో ‘చరిత్ర’ స్థానం సంపాదించుకుంది. తెలుగులో, ప్రబంధాలన్నీ ఎవరివో ఒకరి చరిత్రలే కావడం యాదృచ్ఛికం కాదనుకుంటా! ఈ మాటకున్న నైఘంటికార్థానికే పరిమితమయి చూస్తే చరిత్ర అంటే, నడవడి, స్వభావం, ఆచరణ, జీవితం అనే అర్థాలే స్ఫురిస్తాయి. సంస్కృతసాహిత్యంలో చరిత్ర అనే మాటను ‘శీలం’ అనే అర్థంలో వాడడం కూడా కనిపిస్తుంది. దాని మాటెలా వున్న పత్రికల భాషలో మనం చరిత్రను ఏ అర్థంలో ఉపయోగిస్తున్నామో, అదే అర్థంలో తీసుకుని చూస్తేఅరిస్టాటిల్‌ చెప్పిన మాట గుర్తుకురాక మానదు! ‘‘చరిత్రకన్నా సాహిత్యానికే ఎక్కువ తాత్విక స్వభావం ఉం’’దన్నాడాపెద్దాయన. ఈ విషయంలో, తన గురువుతో తీవ్రంగా విభేదించాడు ఈ గ్రీకు తాత్వికుడు!! సోమసుందరాదులు అరిస్టాటిల్‌తోనే ఏకీభవించా రనిపిస్తుంది. ‘‘చరిత్రాత్మలు పుస్తకాల్లోనే నిలిచివుంటాయి గతం తాలూకు భౌతిక స్వరూపం, కలలా కరిగిపోయిన తర్వాత కూడా దాని స్ఫుటమయిన, స్పష్టమైన స్వరం పుస్తకాల్లోంచి వినిపిస్తూనే వుంటుంది!’’ అన్నాడట థామస్‌ కార్లయిల్‌! అందుకే, మానవ నాగరికతకు తెలిసిన అత్యంత ప్రాచీన సాహిత్యం ఈ చరిత్రాత్మల వీరపూజకు సంబధించినదేనంటారు. వీరపూజనుంచి పుట్టుకొచ్చిందే దైవారాధన‘‘నేటి వీరుడే రేపటి దేవుడ’’న్నారందుకే! సాహిత్యానికి సంబంధించి, వీరపూజ అణగారిన వర్గాలకు ఆత్మ స్థైర్యాన్నీ, త్యాగదీక్షకు ప్రోద్దీపననూ అందించేందుకు ఉపయోగపడే విషయం మనకందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. ఆధునిక యుగంలో వీరపూజ నిర్దిష్ట సామాజిక కొండొకచో రాజకీయ స్వభావం సంతరించుకున్న విషయమూ మనకు అనుభవంలోకి వచ్చిన సంగతే! ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం సందర్భంగా అభ్యుదయకవులు నిజాం నవాబును ‘‘ఖబర్దార్‌’’ అంటూ హెచ్చరిస్తూ ఆలపించిన గీతం ఇందుకు తిరుగులేని నిదర్శనం. ‘ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు ఒక నెత్తుటి బట్టులోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు’ననే గీతంతో ‘వజ్రాయుధం’ కవిగా సుప్రసిద్ధులైన ఆవంత్స సోమసుందర్‌ వారిలో అగ్రగణ్యులు. ఆ తర్వాత ఎంత రాసినప్పటికీ, ఈ గీతానికున్న చారిత్రక ప్రాధాన్యం కారణంగా సాహిత్య చరిత్రలో కలకాలం నిలిచిపోతారు సోమసుందర్‌! (అలాంటి మరో కవి తుమ్మల! ఆయన రాసిన ‘ఎగరాలి ఎగరాలి మన ఎర్రజెండా!’ పాట తుమ్మలను అజరామరులుగా మార్చింది!!) అవును, కార్లయిల్‌ అన్నట్లుగా చరిత్రాత్మ తాలూకు స్ఫుటమయిన స్వరం, సోమసుందర్‌ ` తుమ్మలలాంటి పెద్దల పుస్తకాల పుటల్లోంచి ప్రతిధ్వనిస్తూనే వుంటుంది!
సోమసుందర్‌ వ్యక్తిత్వంలోని మరో ముఖ్యాంశం గురించి ప్రత్యేకించి ప్రస్తావించవలసి వుంది. సీనియర్‌ కవులు, సాధారణంగా, యువకవులకు ‘‘క్లాస్‌ పీకే’’ అవకాశం చిక్కితే వదులుకునే ప్రసక్తే వుండదు. సోమసుందర్‌ అలాంటి బాపతు కాదు. సరదాగా మాటాడి, యువకవుల చేత ఒకట్రెండు కవితలు చదివించుకుని విని, ‘‘పుస్తకం వేశావా? లేదూ ?? ఏం చేస్తున్నావోయ్‌ ఇంతకాలం?? నీ పుస్తకం తక్షణం రావల్సిందే! రాకపోతే నేనూరుకోను సుమా!!’’ అని మృదువుగా మందలించేవారు. ఓ సారి పిఠాపురం వచ్చి, రెండ్రోజులు ఉండిపొమ్మని ఆహ్వానించేవారు. ఉయ్యాలబల్లమీద రెడ్డిగం వేసుకుని కూర్చుని, చుట్ట కాల్చుకుంటూ రాత్రంతా, సదరు యువకవిరాసిన కవితలు చదివించుకుని వింటుండేవారు. లోర్కా, నెరూదా, ఒక్తావివో పాజ్‌ తదితర కవుల కవితలకూ, ఈ యువకవి భావనలకూ ఉన్న సామ్యగుణాలు వివరించే వారు. తెలతెలవారుతుండగా స్ట్రాంగ్‌కాఫీ పుచ్చుకుని గోష్ఠి విరమించేవారు! చాలామంది కుర్రకవులకు అనుభవంలోకి వచ్చిన విషయమే ఇది! మర్నాడు భోజనానంతరం అతని కవితల పుస్తకం వదిలేసివెళ్ళమని, వారం పది రోజుల తర్వాత మరోసారి రమ్మని చెప్పి పంపేవారు. ఆ లోగా, నాలాంటి వాళ్ళకు ఆ కుర్రకవి రాసిన కవితలు కొన్ని పంపించి ‘కనీసం ఒక్కటైనా అచ్చువె’య్యమని సిఫార్సు చేసేవారు. రెండుమూడు గోష్ఠుల తర్వాత ఆ పుస్తకానికి ‘పీఠిక’ సిద్ధంచేసి పెట్టేవారు. (పిఠాపురానికి పీఠికాపురం అనే పేరూ వుంది! దాన్ని సోమసుందర్‌ సార్థకం చేశారు!!) అంతకు ముందు తరంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, శివశంకరులు, విశ్వనాథ తదితరులు అనుసరించిన ఈ సంప్రదాయాన్ని సోమసుందర్‌ కడదాకా కొనసాగించారు!
వ్యాస రచయిత సెల్‌: 8179691822

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img