కిటుముల పంచాయతీ వాలంటీర్లు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఆపత్కాల సమయంలోనూ గడపగడపకు తిరిగి సేవలు అందించిన తమను రాజకీయ స్వలాభం కోసం ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ ద్వారా తమను పక్కన పెట్టడానికి జీర్ణించుకోలేని కిటిమల పంచాయతీ కి చెందిన వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ వాలంటీర్ వృత్తికి రాజీనామాలు సమర్పించారు. రాజీనామా పత్రాలను సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ జయశ్రీ కి అందజేశారు. అనంతరం వాలంటీర్స్ మాట్లాడుతూ గత తెదేపా ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, దానిని దృష్టిలో ఉంచుకొని వైకాపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను తీసుకు వచ్చి ప్రజల వద్దకే పాలనను అందించారన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో మేమంతా ప్రతీ గడపకు తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ, కరోనా సంక్షోభ సమయంలోను కుటుంబానికి దూరంగా ఉంటూ, ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి ప్రజా శ్రేయస్సు కోరుకుంటూ జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు, ప్రభుత్వ సంక్షేమ పధకాలను లబ్ధిదారులకు అందిస్తూ వారి ముఖాల్లో చిరునవ్వులు చూస్తుంటే చెప్పలేని అనుభూతి కలిగేదన్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు, ఎన్నికల కమిషన్ ఎన్నికలు పూర్తయ్యే వరకు రెండు నెలలపాటు తమను పక్కన పెట్టడం, తమ ద్వారా అందవలసిన సేవలు ప్రజలకు అందకుండా చేయడానికి జీర్ణించుకోలేక రాజీనామాలు సమర్పిస్తున్నామన్నారు. మళ్ళీ వైకాపాను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వాలంటీర్ వృత్తికి రాజీనామాలు సమర్పించి మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వాలంటరీ మండల కార్యదర్శి పాటి క్రృష్ణ, నరసింహ రావు, పంచాయతీకి చెందిన 21మంది వాలంటీర్స్ పాల్గొన్నారు.