వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు టిఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన విద్యా ఆగ్రహ దీక్షను అడ్డుకోవడం జగన్ రెడ్డి నియంత పరిపాలనకు నిదర్శనమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, వారం రోజుల ముందే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నా.. అనుమతి ఇవ్వకపోగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టిఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేశారని.. ఇప్పటికైనా పరిస్థితులు చక్కదిద్దాలన్నారు. జీఓ. 77 రద్దు, ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పునరుద్ధరణ, పాఠశాల విలీన ప్రక్రియ రద్దు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, తదితర వాటిని తక్షణమే నెరవేర్చాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.