ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా.. ఏపీలో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ జరిగింది. సెయింట్ థెరిసా పోలింగ్ కేంద్రం వద్ద ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తలు దూషణకు దిగి.. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో మోహన్రావు, ఈశ్వర్కు గాయాలయ్యాయి. రెండు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
ఈ దాడి విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఇతర టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అక్కడికి వచ్చారు. వీరు రాగానే ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా.. ఒంగోలు మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితిని గమనించిన ఒంగోలు డీఎస్పీ నాగరాజు.. రంగంలోకి దిగి ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించారు.ఇటు పోలింగ్ వ్యవహారంపై.. టీడీపీ చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలకు దిగకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. పోలింగ్లో అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఉదయం నుంచి జరిగిన ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, ప్రత్యేక వాహనాల్లో ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా.. అధికారులు మౌనంగా ఉన్నారని బాబు ఆరోపించారు.