ఏపీలో చెడ్డీ గ్యాంగ్ దడ పుట్టిస్తోంది. ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తోంది. పట్టుకునేలోపే పారిపోతారు.. చిక్కరు.. దొరకరు అనే టైపులో ఖాకీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు ముఠా సభ్యులు. ఈ దోపిడీ ముఠా మెంబర్స్ మొన్న విజయవాడలో నిన్న గుంటుపల్లి, తాడేపల్లి.. లెటెస్ట్గా నల్లూరి ఎన్క్లేవ్లో ప్రత్యక్షమయ్యారు. సీసీ ఫుటేజ్ ఆనవాళ్లతో పోలీసుల పట్టుకునే లోపే పత్తాలేకుండా పోయారు. వరుస దోపిడీలు బెజవాడ, గుంటూరు వాసులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దోపిడీలు, దాడులకు తెగబడుతూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. చెడ్డీగ్యాంగ్ హల్ చల్ చేస్తుండటంతో కంటిమీద కనుకులేకుండా గడుపుతున్నారు జనం.
కాగా విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ అరాచకాలపై పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెడ్డీ గ్యాంగ్ వ్యవహారంలో బెజవాడ ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే ఈ గ్యాంగ్ను పట్టుకుంటామన్నారు. ఇప్పటికే ఘటనా ప్రదేశాల్లో వేలిముద్రలు సేకరించామన్నారు. చెడ్డీ గ్యాంగ్ సభ్యులు గుజరాత్, మధ్యప్రదేశ్కు చెందినవాళ్ల్లుగా గుర్తించామని, రైల్వే పరిసరాలను స్థావరాలుగా మార్చుకుని చోరీలకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. అపార్ట్మెంట్స్, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెడ్డీ గ్యాంగ్ భౌతిక దాడులు చేయరని, కేవలం ఎవరు లేని సమయంలో దొంగతనాలకు పాల్పడతారని సీపీ క్రాంతి రాణా టాటా తెలిపారు.