:మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అక్టోబర్ 2న విజయవాడలో ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పీఆర్,ఆర్డీ కమిషనర్ కార్యాలయం నుంచి వైఎస్సాఆర్ ఆసరా, చేయూత, ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’పై జిల్లా కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందరోజులపాటు ‘జగనన్న స్వచ్ఛసంకల్పం’ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాలకు అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రజాభాగస్వామ్యంతోనే స్వచ్ఛ సంకల్పం విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. అక్టోబర్ 7న సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.