పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం చేపట్టారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, టూరిజం అంటే ఏపీ వైపే చూడాలన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలని అధికారులకు సూచించారు.నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలన్నారు. ఆధునిక వసతలు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్రం స్థాయి పెరుగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెరుగుతారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయని అన్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి పెరుగుతాయన్నారు. విశాఖపట్నంలో లండన్ ఐ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలి అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.