రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్ష పార్టీలు సమావేశం అవుతున్న నేపథ్యంలో ఏపీలో ఉన్న టీడీపీ , వైసీపీల వైఖరి స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో లౌకికవాదానికి పెను ప్రమాదం సంభవించిందని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మోదీ పాలన సాగిస్తున్నారని అన్నారు. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు జగన్ మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోందన్నారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం జగన్ అవసరం మోదీకి ఉందని, ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తానని జగన్ ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. కేంద్రం మెడలు వంచుతా అన్న జగన్… ఇప్పుడు నోరెందుకు విప్పడంలేదని రామకృష్ణ ప్రశ్నించారు.