సిపిఐ వినూత్న నిరసన
విశాలాంధ్ర`ఉరవకొండ : ఆంధ్రప్రదేశ్కు నిధులు మంజూరు చేయకుండా తీరని ద్రోహం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఉరవకొండ సిపిఐ పార్టీ నాయకులు మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ శనివారం వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఐ పార్టీ ఎంపీటీసీ సభ్యులు వన్నూరు సాహెబ్ నరేంద్ర మోదీ వేషధారణ వేసుకుని ఒక చేత్తో మట్టి కుండా మరో చేతితో నీటి కుండను పట్టుకొని ఆంధ్రప్రదేశ్లోకి మోదీ అడుగు పెట్టినట్లు నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాని మోదీ ఏపీకి కుండ నిండా నీరు మట్టి తప్ప ఏమీ ఇవ్వలేదని ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ తాలూకా కార్యదర్శి జే మల్లికార్జున మాట్లాడుతూ, కేంద్రంలో మోదీ..రాష్ట్రంలో జగన్..ఇద్దరూ కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు దాసోహమై దేశ సంపదను బడా పారిశ్రామిక నేతల చేతుల్లోకి పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శి వన్నూరు సాహెబ్, పార్టీ సీనియర్ నాయకులు చెన్నారాయుడు, ఉరవకొండ కార్యదర్శి మల్లికార్జున, వజ్రకరూరు కార్యదర్శి సుల్తాన్ ఆ పార్టీ నాయకులు మల్లేష్, రాజు, మహిళా నాయకులు వన్నూరమ్మ, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.