తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందగా, తండ్రి ఆ మృతదేహాన్ని బైక్ పై 90 కిమీ తీసుకెళ్లాల్సి వచ్చిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బాలుడి మృతదేహాన్ని బైక్పై తరలించాల్సి రావడం అత్యంత దారుణమన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని..రాష్ట్రంలో వైద్య్యరంగం దుస్థితికి అద్దం పడుతోందని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆసుపత్రి అంబులెన్స్ లు ఉన్నా ఉపయోగం లేని పరిస్థితుల్లో, ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు ముందుకొచ్చినా, ఆ పేద తండ్రి అంత ఖర్చు భరించలేకపోయాడని చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కన్నబిడ్డ శవాన్ని బైక్ పై వేసుకుని 90 కిలోమీటర్లు ప్రయాణించారని వివరించారు. హృదయాలను మెలితిప్పే ఈ విషాదం రాష్ట్ర ఆరోగ్య రంగ దుస్థితికి నిదర్శనం అని చంద్రబాబు తెలిపారు. జగన్ పాలనలో ప్రతిదీ లోపభూయిష్టమేనని విమర్శించారు.