లోన్ యాప్ ఆగడాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేని యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అనేక మందిని లోన్ యాప్స్ వేధింపులకు గురిచేస్తున్నాయని, అందువల్ల అనుమతి లేని లోన్ యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు లోన్ యాప్ బెదిరింపులు తట్టుకోలేక రాజమండ్రికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. న్యూడ్ ఫొటోలు షేర్ చేస్తామంటూ బెదిరించడంతో వారు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో, వీరి పిల్లలు నాగసాయి (4), లిఖిత శ్రీ (2) అనాధలుగా మిగిలారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరికీ చెరో రూ. 5 లక్షల సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.