ఆంధ్రప్రదేశ్లో భారీవర్షాలు, వరదలపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ప్రభావం అధికంగా ఉన్న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు.వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను సీఎం నియమించారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. వీరు జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం జగన్కు నివేదిస్తారు.నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజేశేఖర్.. చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న.. వైఎస్ఆర్ జిల్లాకు సీనియర్ అధికారి శశిభూషణ్ కుమార్ను నియమించారు. వారు ఇప్పటికే చేరుకున్నారని అధికారులు సీఎం జగన్కు తెలిపారు.వరదల్లో మృతిచెందిన బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న జిల్లాలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు తెలపడంతో.. దీనిపై తగిన కార్యచరణసిద్ధం చేయాలని.. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని.. మంచి భోజనం, తాగునీరు అందించాలని.. వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని సీఎం జగన్ తెలిపారు. రైళ్లు, విమానాలు రద్దైన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో భక్తులు కిందకు రాకుండా పైనే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.ఎక్కడెక్కడ పంట నష్టపోయిందీ వివరాలు తయారు చేయాలి. వీలైనంత త్వరగా వారికి పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నష్టాన్ని నమోదు చేసినప్పుడు కాస్త ఉదారతతో ఉండాలి. మళ్లీ పంటవేసుకునేందుకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు.