: చంద్రబాబు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ వాంగ్మూలం చూసినా సీఎం జగనే నిందితుడిగా తేలుతున్నారని, ఈ విషయంలో సీఎం పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వివేకా హత్యను తనపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందాలని చూశారని, బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారని అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తే… ఏమవుతుంది?… 12వ కేసు అవుతుందని జగన్ వ్యాఖ్యానించడమంటే అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని స్పష్టం చేస్తోందన్నారు.వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న సీఎం జగన్ ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాబాయ్ హత్యలో సూత్రధారి ఎవరనేది ఇప్పుడు తేలిపోయిందన్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు డైవర్ట్ పాలిటిక్స్ అమలు చేస్తున్న జగన్…. ఈ విషయంలో ప్రజలను ఏమార్చలేరన్నారు. హత్యను పాత్రధారులకే పరిమితం చేసి సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుని ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు.ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్ధుల బాధలు కలిచివేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం పేరుతో అప్పుడే వంటింటి నూనె ధరలు పెంచేశారని, రానున్న రోజుల్లో ఇవి మరింత భారం కాకుండా ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు.