టీడీపీ నేత పట్టాభి
వ్యవసాయ మీటర్ల కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, మీటర్ల కొనుగోలులో మంత్రి పెద్దిరెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మీటర్ల కోసం రూ. 6,480 కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెప్పారని, అధికారుల వివరణకు.. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధం లేదన్నారు. రైతులకు ఇచ్చే మీటర్లు ఒక్కొక్కటి రూ.34 వేలకు కొనుగోలు చేస్తున్నారని, విద్యుత్ అధికారులు మీటర్ల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామంటే… మంత్రి పెద్దిరెడ్డి టెండర్లు రద్దు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని ó అన్నారు. కడపకు చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కి మీటర్ల కాంట్రాక్టు ఇచ్చారని పట్టాభిరామ్ అన్నారు. పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటు కాంట్రాక్టు కూడా… సీఎం జగన్ బినామీ సంస్థ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కే ఇస్తున్నారుని ఆరోపించారు. రాష్ట్రంలో అరబిందో, ఆదానీ కంపెనీలు తప్పితే వేరే కంపెనీలు లేవా? అని ప్రశ్నించారు. ఇంకా విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన సబ్సిడీలు రూ.12,340 కోట్లు ఉన్నాయని, రైతులు వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరని పట్టాభిరామ్ అన్నారు.