దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కుటుంబానికి తనతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. గౌతమ్ లేని లోటును భర్తీ చేయలేమని, కానీ ఆయన అందరి మనస్సుల్లో అగ్రస్థానంలో నిలిచిపోయాడని చెప్పారు. నెల్లూరు గ్రామీణ మండలం కనుపర్తిపాడులోని వీపీఆర్ పంక్షన్ హాల్లో నిర్వహించిన గౌతమ్రెడ్డి సంస్మరణ సభలో జగన్ మాట్లాడారు. తన ప్రతి అడుగులో గౌతమ్రెడ్డి తోడుగా ఉన్నారని ఆయన చెప్పారు. తనను ఆయన ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారని తెలిపారు. ఆయనను తానే రాజకీయాల్లోకి తీసుకు వచ్చానని చెప్పారు. ఆరు శాఖలను గౌతమ్రెడ్డి చూసేవారని ఆయన తెలిపారు. ఏపీకి పరిశ్రమలు తీసుకురావాలని గౌతమ్రెడ్డి తపన పడేవారని, పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనేవారని జగన్ చెప్పారు. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానని, సంగం బ్యారేజ్కు మేకపాటి గౌతమ్రెడ్డి బ్యారేజీ పేరు పెడతామని ఆయన తెలిపారు.