వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఆయన కోసం పేదలందరూ ఒకే వేదిక మీదకు రావాలని అన్నారు. జగన్ సీఎం కాకపోతే పేదలు ఇళ్లు లేక అల్లాడిపోతుండేవారని చెప్పారు. డిసెంబర్ 21న జగన్ జన్మదినం సందర్భంగా గుడివాడలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు తనను అడిగినా 2024 ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. గుడివాడ 22వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఈరోజు ప్రారంభమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్లు పనీపాట లేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నింటినీ నెరవేర్చిన వైపీపీకి ప్రజా అనుకూల ఓటు మాత్రమే ఉందని చెప్పారు. తమ 151 సీట్లు తమకు మళ్లీ పక్కాగా వస్తాయని అన్నారు. మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలని వ్యాఖ్యానించారు.