Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

36మంది ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్‌

ఆర్టీసీ డ్రైవర్‌ సమయ స్ఫూర్తి 36మంది ప్రాణాలను నిలబెట్టింది. ఘాట్‌ రోడ్డులో చాకచక్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం భద్రాచలం నుంచి కాకినాడ బయలుదేరింది. ఈ రూట్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌ రోడ్డుకు వెళ్లింది. ఇంతలో వాలమూరు దగ్గర బ్రేకులు ఫెయిలయ్యాయి. బస్సు డ్రైవర్‌ సుబ్బారావు ప్రమాదం జరగబోతోందని అంచనా వేశారు. సుబ్బారావు బస్సులో ఉన్న మరో డ్రైవర్‌, 36 మంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఘాట్‌ రోడ్డులో రెండు మలుపులు దాటాక.. సమయ స్ఫూర్తితో వ్యవహరించి రోడ్డు పక్కనే ఉన్న కొండను ఢీకొట్టారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ కాళ్లు అందులోనే ఇరుక్కుపోగా.. ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో డ్రైవర్‌ క్యాబిన్‌లోనే 2 గంటలపాటు ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి పోలీసులు, లారీ యూనియన్‌ ప్రతినిధులు ఘటనా స్థలానికి వెళ్లి లారీతో బస్సును వెనక్కి లాగి డ్రైవర్‌ను బస్సులో నుంచి బయటకు తీశారు. గాయపడిన డ్రైవర్‌, ప్రయాణికులను మారేడుమిల్లిలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ సుబ్బారావు సమయస్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించి.. తన ప్రాణాలకు తెగించి బస్సును కొండకు ఢీకొట్టించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే ఘాట్‌ రోడ్డు పక్కన ఉన్న 100 అడుగుల లోయలోకి బస్సు దూసుకుపోయేదని.. తమ ప్రాణాలు పోయేవని ప్రయాణికులు అన్నారు. తమను కాపాడిన డ్రైవర్‌ సుబ్బారావును అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img