మూడు రోజుల క్రితం చంద్రబాబు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జులతో సమావేశమైన సంగతి తెలిసిందే. గతంలో సీట్ల కేటాయింపునకు సంబంధించి చివరి నిముషం వరకు తాత్సార ధోరణితో వ్యవహరించేవారన్న అపప్రథను ఆయన తొలగించుకోవాలనుకుంటున్నారు. చివర్లో సీటు ఇవ్వడంవల్ల ఆ అభ్యర్థికి ప్రచారం చేసుకోవడానికి, తగిన వ్యూహాలు రూపొందించుకోవడానికి అవకాశం ఉండదు. అంతిమంగా అభ్యర్థి ఓడిపోవడంతోపాటు పార్టీపై ప్రభావం చూపుతోంది. అందుకే ఈసారి ఆయన ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు.
రాజంపేట లోక్సభ కానీ, పత్తికొండ కానీ.. ఇలా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అవనిగడ్డ స్థానం నుంచి మండలి బుద్ధప్రసాద్ తనయుడు పోటీచేస్తారని ప్రచారం నడుస్తున్నప్పటికీ వాటికి ఫుల్స్టాప్ పెడుతూ బుద్ధప్రసాదే రంగంలోకి దిగుతారని ప్రకటించారు. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, సంతనూతలపాడు నుంచి విజయ్కుమార్, మార్కాపురం నుంచి కందుల నారాయణరెడ్డి, రాజంపేట అసెంబ్లీ నుంచి బత్యాల చెంగల్రాయుడు, ఒంగోలు నుంచి దామచర్ల జానార్థన్, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియ, పుంగనూరు నుంచి చల్లా రామచంద్రారెడ్డి, గుంటూరు తూర్పు నుంచి మహ్మద్ నజీర్ ఖరారయ్యారు.