Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉచిత బూస్టర్‌ డోసు

3.5 కోట్ల మంది లక్ష్యం
రోజుకు 15 లక్షల టీకాల సామర్థ్యం
వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఉచితంగా 3.44 కోట్ల మందికి బూస్టర్‌ డోసు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, యుద్ధ ప్రాతిపదికన బూస్టర్‌ డోసు అందరికీ అందేలా చూడాలని సీఎం జగన్‌ ఆదేశించారని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని చెప్పారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శుక్రవారం నుంచి 18 నుంచి 59 సంవత్సరాల లోపు వారందరికీ బూస్టర్‌ డోసు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా శుక్రవారం నుంచి 75 రోజులపాటు దేశంలోని పౌరులందరికీ ఉచితంగా టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. సీఎం జగన్‌ పరిపాలనా సంస్కరణల్లో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన నేపథ్యంలో మన రాష్ట్రంలో బూస్టర్‌ డోసు కేవలం 45 రోజుల్లో పూర్తయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. బూస్టర్‌ డోసులు వచ్చినవి వచ్చినట్లు వినియోగించుకునేలా చేసే యంత్రాంగం మనకు ఉందన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, వలంటీర్లు తదితర సిబ్బంది మొత్తం బూస్టర్‌ డోసు పంపిణీలో భాగస్వామ్యం అవుతారన్నారు. అన్ని పీహెచ్‌సీలు, సచివాలయాల్లో నుంచి బూస్టర్‌ డోసు పంపిణీ ప్రారంభమైందన్నారు. అక్కడే రిజిస్ట్రేషన్లు చేసి బూస్టర్‌ డోస్‌ వేస్తున్నామన్నారు. కరోనా టీకాలు రెండు డోసులూ 3.95 కోట్ల మందికి పంపిణీ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోగా, అంతకు మించి 4.35 కోట్ల మందికి కోవిడ్‌ టీకా రెండు డోసులు పంపిణీ చేశామని చెప్పారు. 60 ఏళ్లు పై బడిన వారిలో ఇప్పటివరకు 36 లక్షల మందికి రెండో డోసులు కోవిడ్‌ టీకాతో పాటు బూస్టర్‌ డోసు ఇచ్చామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 15 లక్షల బూస్టర్‌ డోసులు ఉన్నాయని, ఆయా జిల్లాలకు వాటిని సరఫరా చేశామని తెలిపారు. ప్రస్తుతం ఈ డోసులను ప్రజలకు అందిస్తున్నామన్నారు. రోజుకు 15 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం ఉందని, ఈ లెక్కన 30 రోజుల్లోగా ప్రజలందరికీ బూస్టర్‌ టీకాలు అందించగల యంత్రాగం మనకు ఉందని తెలిపారు. రెండు డోసులు కలిపి రాష్ట్రంలో 8.54 కోట్ల కరోనా టీకాలు పంపిణీ చేశామని, ఇందులో కేవలం 7.66 లక్షల మంది మాత్రమే ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా టీకా పొందారని, మిగిలిన అందరికీ ఉచితంగానే టీకాలు వేశామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img