అంబేద్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం పేరులో అంబేద్కర్ పేరును తొలగించి జగన్ పేరును చేర్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదువుకునేందుకు రూ. 15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించామని ఆయన తెలిపారు. ఈ పథకానికి జగన్ తన పేరును చేర్చుకోవడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరుని తొలగించడం ఆయనను అవమానించినట్టేనని అన్నారు. ఇది జగన్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే పేరు మార్చి అంబేద్కర్ పేరును చేర్చాలని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ డిమాండ్ చేస్తోందని అన్నారు.