చెన్నై: ప్రముఖ తమిళ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు గుర య్యారు. కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే చెన్నై లోని కొడంబక్కంలో గల మెడ్ వే ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత కిడ్నీలో రాళ్ల కారణంగా నొప్పి వచ్చిందని వైద్యులు గుర్తించారు. లేజర్ సర్జరీ చేయడం ద్వారా ప్రభు కిడ్నీలో రాళ్లు తొలగించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులు హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ప్రభు ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నటుడు ప్రభు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’, రెబల్ స్టార్ ప్రభాస్ ‘డార్లింగ్’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘శక్తి’, మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ తదితర చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన విజయ్ ‘వారసుడు’ సినిమాలో కూడా కనిపించారు.