చెన్నై: ‘ఆర్ఆర్ఆర్’ ఘనవిజయంతో దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. జేమ్స్ కామెరూన్, స్పీల్బర్గ్ వంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. సీనియర్ దర్శకుడు మణిరత్నం కూడా ఇప్పుడు ఈ జాబితాలో చేరారు. చెన్నైలో సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ జరిగింది. ఇందులో భాగంగా ‘భవిష్యత్ సినిమా ట్రెండ్’ అనే అంశంపై నిర్వహించిన చర్చా వేదికలో మణిరత్నం, రాజమౌళి, సుకుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు దర్శకులు ముగ్గురు సమాధానం ఇచ్చారు. ఓ అభిమాని మణిరత్నాన్ని ‘మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన అంశం ఏంటి’ అని అడగ్గా, ‘రాజమౌళి అనుకుంటున్నా’ అని సమాధానం ఇచ్చారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, పనిపై ఉన్న నిబద్థత నన్ను ఎంతోగానో ప్రభావితం చేసింది’ అని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘‘రాజమౌళినే ప్రభావితం చేయడానికి కారణం ఏంటో చెబుతారు. ‘పొన్నియిన్ సెల్వన్’ను సినిమా తీయాలని ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తూ ఉన్నా. అయితే రాజమౌళి ‘బాహుబలి’ తీసే వరకూ నాకు ఎలాంటి మార్గం కనిపించలేదు. అందులో ఆసక్తికర విషయం ఏంటంటే, అది రెండు భాగాలుగా రావడం. ఒక కథను అలా తీసి, ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి తగ్గకుండా చేయవచ్చని అర్థమైంది. ఒకవేళ బాహుబలి రెండు భాగాలుగా రాకపోయి ఉంటే నేను ‘పొన్నియిన్ సెల్వన్’ తీసేవాడిని కాదేమో. థ్యాంక్యూ వెరీ మచ్ రాజమౌళి’’ అని మణిరత్నం అన్నారు. పక్కనే ఉన్న రాజమౌళి ‘సర్, ఇది నా కెరీర్లోనే అతిపెద్ద అభినందన’ నిజంగా ఇది చాలా పెద్దది’ అన్నారు. గతేడాది విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’, ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకున్నాయి. ‘పొన్నియన్ సెల్వన్’ దాదాపు రూ.500 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుతగా ‘పొన్నియిన్ సెల్వన్2’ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.