Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉచితానుచితాల రాద్ధాంతం

ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే కల్పించే సదుపాయాల గురించి మాట్లాడడం సహజం. అధికారంలోకి వచ్చిన తరవాత ఆ హామీలను నెరవేర్చకపోతే వాగ్దానభంగం జరిగినట్టే. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వాగ్దానాలు చేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలను మించిన వాగ్దానాలు కూడా చేయవచ్చు. ఏ ప్రభుత్వం దగ్గరా డబ్బులు కాసే చెట్టు ఉండదు కనక అధికారం కోసం చేసిన వాగ్దానాలను అమలు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ప్రతి రాజకీయ పార్టీ అది అధికారం కోసం పోటీ పడ్తున్నా, పడకపోయినా వాగ్దానాలు చేయకుండా ఉండదు. మోదీ సర్కారు చేసిన వాగ్దానాలనే కాక అమలు చేస్తున్న లేదా సంకల్పిం చిన పథకాలనే గమనించండి. మోదీ హయాంలో ప్రధానమంత్రి పథకాల పేర కొన్ని డజన్ల పథకాలు ఉన్నాయి. ఒక రకంగా ఇవన్నీ వాగ్దా నాలే. గతంలో ఇలాంటి పథకాలకు నెహ్రూ పేరో, ఇందిరా గాంధీ పేరో, రాజీవ్‌ గాంధీ పేరో పెడ్తే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నానా యాగీ చేసేది. తీరా తాను అధికారంలోకి వచ్చిన తరవాత చేపట్టిన పథకాలకు అటల్‌ బిహారీ వాజపేయి పేరో, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పేరో పెడ్తూనే ఉన్నారు. ఏ పేరూ లేకపోతే ప్రధానమంత్రి పథకం అంటున్నారు. వీటి అమలు మాట ఎలా ఉన్నా ఇవన్నీ ప్రజలను ప్రలోభ పెట్టడానికే అన్నది మాత్రం వాస్తవం. ప్రతిపక్షాలు, ముఖ్యంగా రెండు రాష్ట్రాలలో అధికారం సంపాదించి త్వరలో ఎన్నికలు జరగబోయే మిగతా రాష్ట్రాల మీద కన్నేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ మోదీ సర్కారుతో పోటీపడి వాగ్దానాలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. గుజరాత్‌ ఎన్నికలలో తాము అధి కారంలోకి వస్తే మూడు వందల యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా సర ఫరా చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. కేజ్రీవాల్‌ గత మూడు ఎన్నికలలోనూ దిల్లీలో బీజేపీకి అధికారం దక్కకుండా ఈ ఉచితాల మంత్ర దండమే ప్రయోగి స్తున్నారు. పంజాబ్‌లోనూ అదే ఆమ్‌ ఆద్మీ పార్టీని ఆదుకుని అధికారం కట్ట బెట్టింది. కేజ్రీవాల్‌ దిల్లీలో అయితే చాలావరకు అన్న మాట నిలబెట్టుకో గలగడం మోదీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కేజ్రీ పాచిక పారితే గతేమిటన్నది మోదీ భయం. గుజరాత్‌ శాసనసభకు కిందటిసారి ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ గెలిచినా ఓడిపోయి నంత పనైంది. ఇప్పుడు కేజ్రీవాల్‌ పార్టీ రంగంలోకి దిగడంతో మోదీ గుండెల్లో రైళ్లు పరుగెడ్తున్నాయి. అందుకే ఇటీవల మోదీ ఉచితాల మీద విమర్శలు ఎక్కుపెడ్తున్నారు. ఈ సంక్షేమ పథకాలే కాషాయ పార్టీకి విజ యాలు సాధించి పెడ్తున్నాయి. తమ ఎత్తుగడలే ఇతర పార్టీలూ అనుసరించ డంతో మోదీకి మింగుడు పడడంలేదు కనకే ఉచితాలు అనుచితమంటు న్నారు. కొద్ది రోజుల కిందట సీనియర్‌ అధికారులతో సమావేశమైనప్పుడు అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా ఎన్నికలు జరగవలసి ఉన్న రాష్ట్రాలలో ఇతర పార్టీలు ఉచితాల రాగమాలపించడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వీటివల్ల శ్రీలంకకు ఎదురైన సమస్యే మనకూ ఎదురు కావొచ్చు అని మోదీ హెచ్చరించారు. కానీ తమ ప్రభుత్వం పంచి పెడ్తున్న తాయిలాల గురించి మాత్రం సహజంగానే ఆయన ప్రస్తావించలేదు. అనేక రాష్ట్రాలలో రుణ భారం పెరిగిపోతోందని రిజర్వు బ్యాంకు నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో మోదీ ఈ ఆందోళన వ్యక్తం చేశారు. తాయిలాల ఆశ చూపి అధికారంలోకి రావాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నందువల్లే మోదీలో ఆందోళన మొద లైంది. ఈ సంస్కృతిని యువత అడ్డుకోవాలని కూడా ప్రధాని ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభిస్తూ హితవు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ లాంటి కీలకమైన రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి ముందు కరోనా కష్టకాలంలో ఉచితంగా ఇచ్చిన అయిదు కిలోల ధాన్యం దేశ మంతటా కరోనా తరవాత కూడా పంపిణీ చేసింది బీజేపీ సర్కారే కదా. ఇది ఎక్కువ కాలం కొనసాగించడం సాధ్యం కాదని తెలుసు కనకే ఇప్పుడు తాయిలాలు ప్రమాదకరం అని మోదీ అంటున్నారు. ఆయన ప్రదర్శించే గురువింద తత్వం జనం గమనించలేరన్న భరోసా అమితంగా ఉన్నట్టుంది.
మోదీ మాటకు ఊతం ఇచ్చే రీతిలో సుప్రీంకోర్టులో దిల్లీలో బీజేపీ నాయకుడు, సీనియర్‌ న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటించకుండా నిరోధించాలని సుప్రీంకోర్టులో ఓ పిటి షన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని బెంచి విచారించిన సందర్భంగా రాజకీయ పార్టీలు ‘‘నిర్హేతుకమైన ఉచితాలు’’ ప్రకటించకుండా కట్టడి చేయడానికి అవకాశం ఉందేమో ఆర్థిక సంఘాన్ని కనుక్కోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తాయిలాలు ఇస్తామని వాగ్దానాలు గుప్పించడం ఓటర్లకు లంచం ఇవ్వజూపడేమేనని పిటిషన్‌ దాఖలు చేసిన ఉపాధ్యాయ వాదిస్తున్నారు. ఇలా శుష్క వాగ్దానాలు చేసే పార్టీల ఎన్నికల చిహ్నాలను స్తంభింప చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కూడా ఆయన అభ్యర్థించారు. ఈ విషయంలో అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ నుంచి సుప్రీంకోర్టుకు స్పష్టమైన సమాధానం ఏదీ రాలేదు. అప్పుడు న్యాయమూర్తులు కోర్టు హాలులోనే మరో కేసు విచారణ కోసం వచ్చిన కపిల్‌ సిబల్‌ అభిప్రాయం అడిగితే ఆయనా ఉచితాలు ప్రమాదకరమైనవే అన్నారు. ఉచితాల ప్రస్తావన లేకుండా తమ పార్టీలోనే తన ఆలోచన అమలు చేయడానికి ఉపాధ్యాయ ఎందుకు ప్రయత్నించరో అంతుపట్టని కథే. ఎన్నికల కమిషన్‌ ఈ విషయంలో తటస్థ వైఖరి అనుసరిస్తోంది. వాగ్దానాలు చేయడం రాజకీయ పార్టీల విధానాలకు సంబంధించిన అంశం అంటోంది. ఈ మాటా నిజమే. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టే పార్టీల విధాన పరమైన అంశాలలో ఎన్నికల కమిషన్‌ కలగజేసుకోవడానికి వీలు లేదని చెప్పింది. ఇక్కడ చేసే వాగ్దానాలు ఉచితంగా ఇచ్చేవా, కాదా అన్నది ప్రశ్న కాదు. వాగ్దాన భంగం అసలైన సమస్య. అది ప్రమాదకరమైంది. కానీ ఏ వాగ్దానం చేయకుండా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలను ఏం చెప్పి ఓట్లు అడగాలి. కేవలం సిద్ధాంతాల ప్రాతిపదికననే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మన వ్యవస్థ నుంచి ఎప్పుడో అంతర్ధానమైంది. వాగ్దానాలు నెరవేర్చని పార్టీల ఎన్నికల చిహ్నాలను స్తంభింప చేస్తే ఆ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకముందే ఓడిపోయినట్టు అవుతుంది. అదీగాకా ఎన్నికల కమిషన్‌లో నమోదైన రాజకీయ పార్టీలు 650 దాకా ఉన్నాయి. మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య ఇంతకన్నా రెట్టింపు ఉంటుంది. నమోదైన పార్టీలలో పోటీ చేస్తున్నవి ఓ యాభై దాకా ఉండొచ్చు. ఎన్నికలలో పోటీ చేయడం ఇష్టంలేని, సాధ్యం కాని పార్టీలు కూడా ఉండొచ్చు. ఎన్నికలను బహిష్కరించాలని చెప్పే పార్టీలు ఉంటున్నాయి కదా. సమస్యల్లా బొమ్మా నాదే, బొరుసూ నాదే అనే మోదీ వైఖరే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img