అధికారం సంపాదించడం కోసం రాజకీయాలలో మతాన్ని జొప్పించి కలుషితం చేయడం బీజేపీకి అలవాటైన వ్యవహారమే. మతాన్ని, రాజకీయాన్ని మిళితం చేసినందువల్లే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. వాజపేయి నాయకత్వంలో ఆరేళ్లపాటు కొనసాగిన ఎన్.డి.ఎ. ప్రభుత్వంలో బీజేపీదే ప్రధాన పాత్ర అయినా రాజకీయాలకు మతాన్ని వాడుకోవడం ఇంత బహిరంగంగా ఉండేది కాదు. ముస్లింల బూచి చూపించి మెజారిటీ మతస్థులను చేరదీయడంలో బీజేపీ నైపుణ్యం సంపాదించింది. ముస్లింల మద్దతు ఏ మాత్రం లేకపోయినా పరవాలేదు అనుకుంటున్న బీజేపీ ముస్లింల మీద విద్వేషం పెంచడానికి సకలవిధ ప్రయత్నాలూ చేస్తోంది. దానికి దేశ రాజధాని దిల్లీని కేంద్రంగా చేసుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత శుక్రవారం దిల్లీలోని ద్వారకలో జరిగిన సంఘటన, ఆదివారం నాడు జంతర్ మంతర్లో కనిపించిన దృశ్యాలు మతచిచ్చు రగిలించడానికి పనిగట్టుకుని ప్రయత్నిస్తున్నట్టు రూఢ అవుతోంది. దిల్లీలోని ద్వారక ప్రాంతంలో శుక్రవారం నాడు ఆ ప్రాంతంలో నివాసం ఉండే వారి సమాఖ్య సమావేశం జరిగింది. హజ్ హౌజ్ నిర్మాణాన్ని నిరోధించాలని కోరుతూ ఈ సమావేశ ఫలితంగా దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాశారు. నిరోధించకపోతే కలహాలు చెలరేగుతాయని కూడా హెచ్చరించారు. హఔజ్ హఔజ్ వ్యతిరేక ఉద్యమంలో పేరు స్థానికులదైనా ప్రధాన పాత్ర బీజేపీదే. ఆదివారం నాడు బీజేపీ నాయకుడు ఒకరు జంతర్ మంతర్లో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాని ప్రధాన ఉద్దేశం ఉమ్మడి వివాహ చట్టం కోసం డిమాండు చేయడం. ఇది పైకి కనిపించే అంశం మాత్రమే. భారత శిక్షా స్మృతి బ్రిటిష్ వలస పాలకుల కాలంలో రూపొందించింది కనక అందులోని అనేక సెక్షన్లను తొలగించవలసిన అవసరం ఉందని ఈ సమావేశం ఏర్పాటు చేసిన వారు వాదిస్తున్నారు. నిజానికి ఈ నిరసన ప్రదర్శనలో ప్రధానాంశం ముస్లింల మీద విద్వేషం నింపడమే. అక్కడ గుమిగుడిన జనం ఒక యూట్యూబ్ చానల్ విలేఖరిని ‘‘జై శ్రీరాం’’ నినాదాలు చేయాలని బలవంతపెట్టారు. పత్రికా రచయితలను ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి సంఘటనలు ఇటీవల కనీసం మూడు జరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు విపరీతంగా ప్రచారంలో ఉన్నాయి. ఆ సమావేశాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులను ఆ వీడియోల్లో స్పష్టంగా గుర్తించవచ్చు. కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధీనంలో పని చేసే దిల్లీ పోలీసులు మాత్రం మొదట ‘‘గుర్తు తెలియని’’ మూకలపై కేసు నమోదు చేశారు. ఆ తరవాతే విద్వేష ప్రచారానికి కారకులనుకుంటున్న కొంతమంది బీజేపీ నాయకులను సోమవారం రాత్రి నిర్బంధించారు. ఇందులో బీజేపీ నాయకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ, మరో బీజేపీ నాయకుడు గజేంద్ర చౌహాన్ కూడా ఉన్నారు. ఉమ్మడి వివాహ చట్టం కోసం ఏర్పాటు చేశామంటున్న ఈ సమావేశంలో ప్రధానంగా ముస్లింలపై విషవమనమే. అసలు ఈ సమావేశమే పోలీసుల అనుమతి లేకుండానే జరిగిందట. తమ సమావేశం ముగిసిన తరవాత ముస్లిం వ్యతిరేక నినాదాలు చేశారని అశ్విన్ ఉపాధ్యాయ అంటున్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేసిన సేవ్ ఇండియా ట్రస్ట్తో కూడా తనకు ఎలాంటి సంబంధమూ లేదని, ఆ సమావేశానికి తాను ఆహ్వానితుడిగా వెళ్లానని ఉపాధ్యాయ వాదిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన అనేక ఫొటోలను, వీడియోలను ఉపాధ్యాయ ట్విట్టర్లో ఉంచారు కాని తరవాత తొలగించినట్టున్నారు.
ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. 2020 ఆరంభంలో దేశ రాజధాని దిల్లీలో గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతటి తీవ్రమైన మత కలహాలు చెలరేగాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ ఉద్యమం తరవాత ఈ కలహాలు చెలరేగడాన్నిబట్టి వాటి ఉద్దేశం ఏమిటో సులభంగానే గ్రహించవచ్చు. ఆ కలహాల బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగనే లేదు. కలహకారకులకు శిక్షలు పడనే లేదు. ఈ అంశంపై జరుగుతున్న దర్యాప్తు మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసమ్మతి వాదుల మీద చర్య తీసుకోవడానికి ఈ ఉదంతాన్ని వినియోగించుకుంటున్నారన్న వాదన ఉండనే ఉంది. అసలు నిందితులను వదిలేస్తున్నారు. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ సంస్థ తాజా సంఘటనలపై తనంత తాను ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణకు చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. జంతర్ మంతర్లో చేసిన నినాదాలు ‘‘బహిరంగంగా మారణకాండ’’కు పిలుపు ఇస్తున్నట్టుగా ఉన్నాయని ఈ లేఖలో పేర్కొన్నారు. జంతర్ మంతర్లో వినిపించిన నినాదాలను వాక్ స్వాతంత్య్రంలో భాగంగా భ్రమ పడకూడదు. ఇవి నేరుగా ఒక మతవర్గానికి వ్యతిరేకమైనవి. రెచ్చగొట్టేవి. ఆర్.ఎస్.ఎస్. హిందుత్వ ఎజెండా మోదీ ద్వారా అనుకున్న దానికన్నా ఎక్కువ వేగంగా, పదునుగా అమలవుతోంది. తమ రాజకీయ జీవితమంతా ముస్లిం వ్యతిరేకత పునాదిగానే నిర్మించుకున్న వారు అధికారంలో ఉన్న సమయంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుందనుకోలేం. ఏడేళ్లుగా ముస్లింలపై ద్వేషం ఎలా పెంచుతున్నారో స్పష్టంగానే కనిపిస్తోంది. దీనికి బాధ్యుల మీద ఏ చర్యా ఉండదు. ఉన్నా అది కంటి తుడుపే. అధికారంలో ఉన్నది తమ వారేనన్న ధీమా మతోన్మాదులకు అదనపు శక్తి సమకూరుస్తోంది. షాహీన్ బాగ్లో నిరసన తెలియజేస్తున్న వారిలో తీవ్రవాదులున్నారు, అత్యాచారాలు చేసేవారు ఉన్నారు అని ఒక ఎంపి అనగలిగారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారిని వారి వస్త్రధారణ బట్టి గుర్తించవచ్చు అని సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఓటు వేయడానికి మీట నొక్కితే షాహీన్ బాగ్లో నిరసన తెలియజేస్తున్న వారికి విద్యుదాఘాతం తగిలినట్టు ఉండాలని అని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇవన్నీ అధిక సంఖ్యాకుల్లో మతోన్మాదాన్ని పెంచడానికి, ముస్లింల మీద విషం విరజిమ్మడానికి ఉపకరించినప్పుడు ఆ దుష్పరిణామాలను నివారించడం ఎలా సాధ్యం. ముస్లిం వ్యతిరేకత కుంపటి చల్లారకుండా సంఫ్ు పరివార్, దాని రాజకీయ అంగమైన బీజేపీ సకల జాగ్రత్తలూ తీసుకుంటోంది. మతోన్మాదం ఎంత తీవ్ర పరిణామాలకు దారి తీయగలదో ఈ పరిణామాలను చూసి గ్రహించవచ్చు. మత విద్వేషం జాతి జనుల నరనరాన జీర్ణించుకు పోయేట్టు చేస్తున్నప్పుడు మైనారిటీలకు రక్షణ ఉంటుందన్న హామీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్నికల్లో ముస్లింలను భారతీయ జనతా పార్టీ తరఫున కనీసం పోటీ చేయడానికైనా మోదీ హయాంలో అవకాశం ఇవ్వడం లేదు. ఏ ఎన్నికల అభ్యర్థులను చూసినా ముస్లింల పేరు ఒక్కటి కూడా కనిపించదు. అధిక సంఖ్యాకుల మద్దతు కూడగడితే తమ అధికారానికి భరోసా ఉంటుందనుకుంటున్నారు. ఇదంతా అనుకోకుండా ఎదురైన పరిణామం కాదు. పనిగట్టుకుని దీనికి అనువైన వాతావరణం ఏర్పాటు చేశారు.