Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

వందరోజుల భారత్‌ జోడో యాత్ర

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి ప్రారంభించిన భారత్‌ జోడో యాత్ర నేటికి 100 రోజులు పూర్తి అయింది. 150 రోజుల్లో 3,500 కిలోమీటర్లు సాగవలసిన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగియాల్సి ఉంది. గత మూడు నెలల నుంచి ఈ యాత్రకు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందనే కనిపిస్తోంది. యాత్ర పొడవునా రాహుల్‌తో పాటు కలిసి అడుగేస్తున్న వారి సంఖ్య తక్కువే కావచ్చు. సుదీర్ఘమైన ఏ యాత్రలో అయినా ఇదే పద్ధతి ఉంటుంది. కానీ ఎక్కడికక్కడ వేలు, లక్షల మంది రాహుల్‌ ప్రారంభించిన యాత్రలో భాగస్వాములు అవుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రలో భాగస్వాములు కావడంలో ఆశ్చర్యం లేదు. నిద్రాణస్థితిలోఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఈ యాత్ర నూతనోత్సాహం కలిగించింది. కాంగ్రెస్‌ ఏదైనా సాధించగలదన్న నమ్మకం కార్యకర్తలకు కుదిరినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఎన్నిఉన్నా పరస్పరం కలహించుకునే నాయకులు కూడా ఎక్కడో ఒక చోట రాహుల్‌గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. అనేక ప్రతిపక్షపార్టీల నాయకులు కూడా ఈ యాత్రలో పాల్గొని సంఫీుభావం తెలిపారు. యోగేంద్ర యాదవ్‌ లాంటి సామాజిక ఉద్యమకారులు, సామాజిక ఉద్యమాలతో సంబంధం ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కూడా రాహుల్‌తో కలిపి అడుగేస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు కూడా రాహుల్‌ భారత్‌ జోడో యాత్రతో మమేకం అయ్యారు. వీరెవరూ ఎప్పుడూ కాంగ్రెస్‌ వారు కారు. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌, నర్మదా బచావో ఆందోళనవల్ల ప్రసిద్ధురాలైన పట్టు విడువని పర్యావరణ కార్యకర్త మేధా పాట్కర్‌ లాంటి వారు రాహుల్‌ యాత్రలో భాగస్వామ్యులు కావడం అంటే ఆ యాత్రలో ఎంతో కొంత సారం ఉందనే అనుకోవాలి. సినీ నటి స్వరా భాస్కర్‌, సామాజిక కార్యకర్త హర్ష్‌ మందర్‌, మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ, హిందీ సినీ నటులు, సినిమా రచయితలు, రంగస్థల నటులు, సినిమా డైరెక్టర్లు, కవులు ఈ యాత్రలో భాగస్వాములయ్యారు. ప్రతిపక్షపార్టీ నేతల్లో ప్రముఖులు, పార్లమెంటులో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యురాలు సుప్రియా సూలే, శివసేన అగ్రనాయకుడు ఆదిత్య ఠాక్రే, సామాజిక కార్యకర్త, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ లాంటి వారు కూడా భారత్‌ జోడో యాత్రలో భాగస్వాములయ్యారు. మొన్నటిదాకా ఎందుకూ కొరగాడనుకున్న రాహుల్‌ గాంధీకి విభిన్న వర్గాలకు, వృత్తులకు, రంగాలకు, రాజకీయ పార్టీలకు చెందిన వారు సంఫీుభావం తెలియజేయడానికి బలమైన కారణం ఏదో ఒకటి లేకుండా ఉండదు. శివసేన నాయకుడు అధినేత, పార్లమెంటులో నేషనలిస్టు కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా సూలే కూడా రాహుల్‌ ప్రయత్నానికి అండగా నిలిచారు. ఈ యాత్ర ఇప్పటిదాకా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ ద్వారా సాగింది. ఇందులో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రం ఒక్కటీ లేకపోయినా భారత్‌ జోడో యాత్రకు విశేషమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ యాత్ర కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో సాగుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో కూడా రాహుల్‌కు విశేష ఆదరణ లభించడం సులువుగా కొట్టిపారేయదగిన అంశం ఏమీ కాదు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో డిసెంబర్‌ 19న భారీ బహిరంగసభ నిర్వహించాలనుకుంటున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన శ్రీనగర్‌లో ముగుస్తుంది.
వంద రోజులు ఈ యాత్ర సాగడం కుదేలైపోయి ఉన్న కాంగ్రెస్‌ దృష్టితో చూస్తే ఓ మైలురాయి అనుకోవాలి. రాహుల్‌ గాంధీ రాజకీయా ల్లోకి వచ్చి చాలాకాలం అయినా ఆయన పూర్తి కాలం రాజకీయ నాయకుడు కాదని, తరచుగా విదేశాలకు విహార యాత్రలకు వెళ్తుంటాడని, ఒక్కోసారి దేశంలోనే ఉన్నా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్నట్టు ఉండిపోతారన్న విమర్శలు విస్తారంగానే ఉన్నాయి. మంగళవారం దాదాపు 30 సంస్థలకు ప్రాతినిధ్యం వహించే దళిత కార్యకర్తలు రాహుల్‌ ను కలుసుకున్నారు. సోమవారం అనేక మహిళా సంఘాలవారు రాహుల్‌తో చర్చించారు. ఈ యాత్రకు అనూహ్యమైన స్పందన రావడం మోదీ ప్రభుత్వాన్ని కలవర పెడ్తోంది. బింకానికి పోయి చాలా మంది బీజేపీ నాయకులు ఈ యాత్రను, రాహుల్‌గాంధీని చులకనచేస్తూ మాట్లాడు తున్నప్పటికీ వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టడం స్పష్టంగానే కనిపిస్తోంది. యాత్ర పొడవునా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అసత్య ప్రచార బండారం బట్ట బయలు అవుతూనే ఉంది. అనేక జీవన రంగాలకు చెందిన వారు భారత్‌ జోడో యాత్రలో భాగస్వాములు కావడం మోదీ ప్రభుత్వంపై పెరుగుతున్న విముఖతకు తార్కాణంగా కనిపిస్తోంది. ఈ యాత్రను ఎన్నికల్లో విజయం సాధించడానికి గానీ, తక్షణ రాజకీయ ప్రయోజనాలు పొందడానికి రూపొందించలేదు. ఈ యాత్ర ఇటీవల శాసనసభ ఎన్నికలు జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి సాగకపోవడమే ఇది ఎన్నికల లబ్దికి అతీతమైన యాత్ర అని స్పష్టం అవుతోంది. ఈ యాత్ర ప్రభావమే లేకపోతే మోదీ నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించి ఉండరు. శుక్రవారం నుంచి కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో రాష్ట్రస్థాయి కాంగ్రెస్‌ యాత్రలు ప్రారంభమయ్యాయి. భారత్‌జోడో యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీకి ఎక్కడ ఎంత మంది మద్దతు తెలిపారన్నది ప్రధానం కాదు. ఎందుకంటే యాత్ర సందర్భంగా బ్రహ్మాండమైన ర్యాలీలు నిర్వహించనే లేదు. జనాన్ని తరలించిన ఆనవాళ్లు లేవు. అనునిత్యం ప్రముఖులే కాక సామాన్యులు కూడా రాహుల్‌ను కలుసుకుంటూనే ఉన్నారు. ఆయన వారి సమస్యలను శ్రద్ధగా వింటున్నారు. సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. దక్షిణాది కొస నుంచి ఉత్తరాన చివరి వరకు సాగుతున్న ఈ యాత్రకు మంచి స్పందన వస్తున్నందువల్ల దేశం తూర్పు నుంచి పడమరకు కూడా ఇలాంటి యాత్ర నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు కాగ్రెస్‌ వర్గాలలో సాగుతున్నాయి. ఈ యాత్రవల్ల కాంగ్రెస్‌ మీద ప్రజలకు ఉన్న అభిప్రాయం సమూలంగా మారిపోయినట్టు కనిపిస్తోంది. వివిధ ప్రాంతాలలో రాహుల్‌కు ఆదరణ ఎంతగా కనిపించినా ఆ స్పందనను కాంగ్రెస్‌ ను సంస్థాగతంగా పటిష్ఠం చేయడంలో కాంగ్రెస్‌ ఎంత మేరకు సఫలమవుతుందన్నది పెద్ద ప్రశ్నే. పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అధికార పక్షం పనిగా పెట్టుకున్నందువల్ల కాంగ్రెస్‌ అగ్రనాయకుడు నేరుగా ప్రజలను సంప్రదించే అవకాశం వచ్చింది. ఈ నెల 28వ తేదీన అసోం, ఒడిశా, త్రిపురలో ఆ రాష్ట్రాలకే పరిమితమైన యాత్రలను కాంగ్రెస్‌ నిర్వహించాలని సంకల్పించింది. పశ్చిమ బెంగాల్‌, బిహార్‌లో కూడా ఈ యాత్రలు జరగొచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img