. ఎక్కడికక్కడ అరెస్టులు
. వామపక్ష నేతల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
. సీపీఐ నేత విమల మెడలో ఫ్లెక్సీ చింపివేత
విశాలాంధ్ర-విశాఖ: ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారు. సీపీఐ, సీపీఎం, కార్మికసంఘాలు, ప్రజాసంఘాల నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. అరెస్టు చేశారు. లాఠీలకు పని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణా కాలేజీ రోడ్డు నుండి ప్రధాని సభ జరుగుతున్న ఏయూ మైదానంలోకి ప్రదర్శనగా వెళుతున్న సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలను ఆడ్డుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. మద్దిలపాలెం జాతీయరహదారిపై సుమారు 35 మందిని పోలీసులు అడ్డగించి, అరెస్టు చేశారు. వారిని ఎంవీపీ పోలీస్ స్టేషన్, బ్యారక్లకు తరలించారు. సీపీఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల, ఎస్కే రెహమాన్, నాయకులు జి.వామనమూర్తి, యు.నాగరాజు, కె.అచ్యుతరావు, వై.రాంబాబు, ఆర్. శ్రీనివాసరావు, కె.వనజాక్షి, పి.పద్మ, ఎం.శ్రీనివాసరావు, జి.నాయుడు, సీఎన్ క్షేత్రపాల్, సీహెచ్ కాసుబాబు తదితరులు స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, రైల్వేజోన్ కోసం రాసిన ఫ్లెక్సీలను మెడలో ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. పోలీసులు వలయంగా ఏర్పడి వారిని ముందుకు వెళ్లకుండా నిరోధించారు. అయినా కొంతమంది కార్యకర్తలు పోలీసులను దాటుకొని ఏయూ మైదానం వైపు పరుగులు తీశారు. అత్తిలి విమల మెడలో ఉన్న ఫ్లెక్సీని పోలీసులు బలవంతంగా లాగి చింపివేశారు. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ మోదీ ప్రధాని అయిన తర్వాత రాష్ట్రానికి చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి తీసుకొచ్చారు తప్ప ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రధాని ఏమిచ్చారని విశాఖ పర్యటనకు వచ్చారని ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం ప్రధాని పర్యటనకు వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టంచేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వీ కుమార్ మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ను అమ్మకానికి పెట్టిన మోదీకి వైసీపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలకడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖపట్నం రాజధానిగా ఉండాలంటే స్టీల్ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాల్సిందేనని చెప్పారు. నిన్నటి నుంచి వామపక్ష పార్టీల నాయకులను, ప్రజాసంఘాల కార్యకర్తలను అరెస్టు చేసి కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. అరెస్ట్ అయిన వారిలో సీపీఎం నాయకులు బి.జగన్, బొట్టా ఈశ్వరమ్మ, బి.పద్మ, రాంబాబు, సుబ్బారావు, చంటి, కృష్ణారావు తదితరులు ఉన్నారు.
అక్రమ అరెస్టులను ఖండిరచిన పైడిరాజు
రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు తీవ్రంగా ఖండిరచారు. హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టు చేస్తారా అని నిలదీశారు.పోలీసు స్టేషన్లలో నిర్బంధించిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధానిని ప్రసన్నం చేసుకోవడానికి సీఎం జగన్ చూపిన చొరవ రాష్ట్ర ప్రయోజనాల కోసం చూపలేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీని ద్వారా అర్థమవుతోందని అన్నారు.