పెగాసస్ స్పైవేర్ను ఇజ్రాయెలీ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూపు సమర్థించుకుంది. పెగాసస్తోపాటు ఇలాంటి టెక్నాలజీల వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రపోగలుగుతున్నారని పేర్కొంది. మానవ హక్కుల మద్దతుదారులు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘా పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెగాసస్ స్పైవేర్ను ఉపయోగించినట్లు ఆరోపణలు రావడంతో దుమారం రేగింది. అనేక దేశాల ప్రభుత్వాలు ఈ కంపెనీ నుంచి ఈ స్పైవేర్ను కొనుగోలు చేశాయని ఓ ఇంటర్నేషనల్ మీడియా కన్సార్షియం బయటపెట్టిన నేపథ్యంలో ఎన్ఎస్ఓ అధికార ప్రతినిధి ఒకరు ఈ విధంగా మాట్లాడారు. పెగాసస్తోపాటు ఇటువంటి టెక్నాలజీల వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రపోగలుగుతున్నారని, వీధుల్లో సురక్షితంగా సంచరించగలుగుతున్నారని చెప్పారు. నేరగాళ్ళు, ఉగ్రవాదులను నిరోధించేందుకు, వారిపై దర్యాప్తు చేసేందుకు పెగాసస్ వంటి టెక్నాలజీలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు.