యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు
6 లక్షల క్యూసెక్కుల నీరుదిగువకు విడుదల
పులిచింతల ప్రాజెక్టును పరిశీలించిన ఇరిగేషన్ మంత్రి అనిల్
నిపుణులతో కమిటీ వేసి నివేదిక తీసుకుంటామని వెల్లడి
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్నవరద ఉధృతి
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
విశాలాంధ్ర`విజయవాడ/జగ్గయ్యపేట/గుంటూరు : భారీగా వస్తున్న వరద నీటి ఉధృతికి డాక్టర్ కేఎల్ రావు పులిచితల ప్రాజెక్టు 16వ నంబరు గేటు కొట్టుకుపోయింది. ఎగువ నుంచి నీటి ఉధృతి పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేసేందుకు గురువారం వేకువజామున 3.30 గంటల సమయంలో పులిచింతల గేట్లు రెండు అడుగుల మేర ఎత్తేందుకు సిబ్బంది ప్రయత్నించగా, హైడ్రాలిక్ గడ్డర్ విరిగి 16వ నంబరు గేటు ఊడిపోయి నీటిలో కొట్టుకుపోయింది. తక్షణమే మరమ్మతులు చేసేందుకు అవసరమైన చర్యలను అధికారులు చేపట్టారు. ప్రాజెక్టు గేటుకు మరమ్మతులు చేసేందుకు నీటిని ఐదు మీటర్లలోపు పరిమితం చేయాలని, 10 టీఎంసీలకు తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పులిచింతల ప్రాజెక్టు నుంచి 16వ నంబరు గేటుతోపాటు మరో 14 గేట్లను ఎత్తి 6లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ గురువారం ఉదయమే పులిచింతల ప్రాజెక్టు వద్దకు చేరుకుని విరిగిపోయిన 16వ నంబరు గేటు ప్రాంతాన్ని పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు.
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు : మంత్రి అనిల్
గేటుకు మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు నిపుణులతో కమిటీని నియమిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నుంచి కూడా నిపుణులు వస్తారని, శుక్రవారం సాయంత్రానికి మరమ్మతు పనులు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ఇంజినీర్లు, ఇంజినీరింగ్ నిపుణుల బృందాలు పరిశీలించాయన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సుమారు 6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. స్టాప్లాక్ గేట్లను ఏర్పాటు చేయాలన్నా నీటిని దిగువకు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. విరిగి పడిన గేటు స్థానంలో స్టాప్లాక్ గేటును దించే సమయంలో మళ్లి నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టులో నీరు 10 టీఎంసీలకు తగ్గిన తర్వాతే మరమ్మతులు చేపట్టే అవకాశం ఉందన్నారు. గేటు మరమ్మతు నిమిత్తం నీటిని దిగువకు వదిలినా, రానున్న రోజుల్లో వర్షాలు కురిసి వరద నీరు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అప్పుడు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసుకోవచ్చన్నారు.
ప్రజలను అప్రమత్తం చేశాం : కలెక్టర్ నివాస్
పులిచింతల ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడం ద్వారా గురువారం ఉదయం నుంచి వరద నీరు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. దీనివల్ల కృష్ణా నదీలో నీరు పెరుగుతుందని, వరద ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అధికారులను అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. పులిచింతల డ్యామ్ వద్ద గురువారం సాయంత్రం 6 గంటలకు ఔట్ ఫ్లో 5,05,870 క్యూసెక్కులు కాగా, ఇన్ఫ్లో 2,01,009 క్యూసెక్కులు ఉందని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 1,12,939 క్యూసెక్కులు ఉండగా, 1,03,250 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నామని వివరించారు. వరద ప్రవాహం పెరిగి గురువారం అర్ధరాత్రి తర్వాత 3.97లక్షల క్యూసెక్కులకు ఇన్ఫ్లో చేెరే అవకాశం ఉందని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జలవనరుల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పులిచింతల ఎస్ఈ రమేష్బాబు, ఈఈ శ్యామ్ ప్రసాద్, డీఈఈలు సుధాకర్, అరుణ కుమారి తదితరులు మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్నారు.
పులిచింతలను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు
పులిచింతల ప్రాజెక్టు వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి 16వ నంబరు గేటు విరిగిపోయిన ప్రదేశాన్ని రవాణ, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పులిచింత ప్రాజెక్టు గేటు విరిగిపోయిన ప్రాంతంలో తక్షణ మరమ్మతులు చేపట్టేందుకు తీసుకున్న చర్యలను మంత్రులకు పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ రమేష్బాబు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదాయభాను మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన మరమ్మతు చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామన్నారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన. వరద తాకిడికి 16వ నంబరు గేట్ కొట్టుకుపోయింది. నీటి సామర్థ్యం తగ్గిస్తేనే గేటు బిగించడం సాధ్యం.
గేటును వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు తరలి వస్తుండడంతో.. పులిచింతల ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. పులిచింతలకు ప్రస్తుతం 2,12,992 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు ఉండగా, ప్రస్తుతం 172.76 అడుగులు ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 42.34 టీఎంసీల నీరు ఉంది.