స్వయం సమృద్ధ భారత్కు అవసరమైనవన్నీ గోవాకు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ స్వయంపూర్ణ గోవా లబ్ధిదారులతో వర్చువల్ సమావేశంలో శనివారం మోదీ మాట్లాడుతూ, అభివృద్ధికి కొత్త నమూనా గోవా అని అన్నారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వంలో రాష్ట్రం చాలా చురుగ్గా కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తోందన్నారు. స్వయంపూర్ణ పథకానికి ఉండే అతి పెద్ద బలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒకటని చెప్పారు. ముఖ్యంగా చేపల ప్రాసెసింగ్ రంగంలో గోవా దేశానికి ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు. భారత దేశ చేపలను తూర్పు ఆసియా దేశాల్లో ప్రాసెస్ చేసిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లకు పంపుతారన్నారు. దీనిని మార్చడం కోసం తొలిసారి మత్స్య పరిశ్రమ రంగానికి భారీ స్థాయిలో సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.