వారంలో భారీగా పెరగనున్న కొత్త ఇన్ఫెక్షన్ల
ఒమిక్రాన్పై కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ హెచ్చరిక
న్యూదిల్లీ : ప్రపంచ దేశాలను కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతోంది. ఒక్కొక్కటిగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. భారత్లో ఇప్పటికే అనేక రాష్ట్రాలకు చాప కింద నీరులా చేరుకున్న ఈ వైరస్ విధ్వంసం అంచనాలకు మించి ఉండవచ్చు అన్న సంకేతాలున్నాయి. ప్రస్తుతం కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రధాన నగరాలు ఆంక్షల బాటను అనుసరిసున్నాయి. కేవలం రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ కేసుల విస్పోటనాన్ని భారత్ చూడాల్సి రావచ్చు అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ కట్టుమాన్ హెచ్చరించారు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అని అన్నారు. వారంలో కొత్త ఇన్ఫెక్షన్లు భారీగా నమోదు అవుతాయని కోవిడ్`19 ఇండియా ట్రాకర్ను తయారు చేసిన కట్టుమాన్ తెలిపారు. అయితే విధ్వంసం ఎంతలా ఉంటుందో అంచనా వేయలేమన్నారు. కట్టుమాన్, ఆయన పరిశోధకుల బృందం భారత్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త ఇన్ఫెక్షన్ల రేటు భారీగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మరో వారంలో పరిస్థితి దారుణంగా ఉండవచ్చునన్నారు. కాగా, కోవిడ్ కేసులను లెక్కతేల్చడంలో కేంబ్రిడ్జ్ ఇండియా ట్రాకర్ పాత్ర కీలకం.
మూడు వారాల గరిష్టానికి కొత్త కేసులు
భారత్లో కొత్త కేసుల సంఖ్య మూడు వారాల గరిష్ఠానికి చేరుకుంది. బుధవారం 9,195 కోవిడ్ కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 34.8 మిలియన్లకు పెరిగింది. మృతుల సంఖ్య 4,80,5932గా ఉంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు 781 నమోదు అయ్యాయి. టీనేజర్లకు బూస్టర్ డోసు ఇచ్చేందుకు భారత్లో రంగం సిద్ధమైంది. మరో రెండు కొత్త వాక్సిన్లు, ఓ పిల్కు అత్యవసర వినియోగానుమతులు లభించాయి. సినిమా హాళ్లు, స్కూళ్లు, జిమ్ తదితర జనసమూహ ప్రాంతాలను మూసివేస్తూ న్యూదిల్లీ ఆదేశాలు జారీచేసింది, రాత్రి కర్ఫ్యూ అమలు చేసింది. కార్యాలయాలు 50శాతం సామర్థ్యంతో పనిచేస్తాయని తెలిపింది. అలాగే ముంబైలోనూ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 1,377 కొత్త కేసులు దేశ ఆర్థిక రాజధానిలో నమోదు అయ్యాయి.