రాహుల్ వ్యాఖ్యలకు శశిథరూర్ సమర్థన
తిరువనంతపురం : హిందూయిజం, హిందుత్వపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ అభిప్రాయాన్ని ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ సమర్థించారు. రాజస్థాన్లో జరిగిన పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గతంలో తాను చేసిన పోస్ట్ను మరోసారి శశి థరూర్ షేర్ చేశారు. రాజస్థాన్లోని కాంగ్రెస్ కార్యకర్తలకు మూడు రోజులు జరిగిన శిక్షణ కార్యక్రమాల సందర్భంగా రాహుల్గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలకు తలవంచేవారు హిందుత్వాన్ని అనుసరించేవారేనని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను శశి థరూర్ బుధవారం సమర్థించారు. ‘అసంపూర్ణంగా ఉన్నప్పటికీ, ఓ ఆసక్తికరమైన తులనాత్మక పరిశీలన చక్కర్లు కొడుతోంది’ అని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం శశి థరూర్ చేసిన పోస్ట్లో, విభిన్న మూలాలుగల, వ్యవస్థాపకుడు లేని, వివిధ భారతీయ సంస్కృతులు, సంప్రదాయాల కలయికే హిందూయిజమని పేర్కొన్నారు. సావర్కర్ ప్రతిపాదించిన ఏకజాతి జాత్యహంకార-భౌగోళిక వర్గమే హిందుత్వమని తెలిపారు. హిందూయిజం వేలాది సంవత్సరాల పురాతనమైనదని, హిందుత్వాన్ని మొదట 1923లో సావర్కర్ ప్రతిపాదించారని, ఇది రాజకీయ సిద్ధాంతమని తెలిపారు. హిందూయిజానికి వేదాలతో సహా అనేక గ్రంథాలు ఉన్నాయని, కానీ హిందుత్వానికి 1928లో ప్రచురితమైన ‘హిందుత్వ : హూ ఈజ్ ఏ హిందూ?’ అనే రాజకీయ కరపత్రమే ముఖ్యమైనదని వివరించారు.