Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇది ప్రజా తిరుగుబాటు

. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు గుణపాఠం తప్పదు
. సీపీఐ, సీపీఎంను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా
. టీడీపీ అధినేత చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) గెలుపు ప్రజా విజయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా తీర్పును జగన్‌ సర్కార్‌పై తిరుగుబాటుగా వర్ణించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్లు రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారని, చైతన్యం, బాధ్యతతో వచ్చి ఓట్లేశారన్నారు. జగన్‌ బాధ్యతలేని వ్యక్తి, మోసాలు చేయడంలో దిట్ట అని విమర్శించారు. ఆయనది ధనబలం.. రౌడీయిజం.. ఇవి ఎప్పటికీ శాశ్వతం కాదని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఉగాది పంచాంగాన్ని ప్రజలు రెండు రోజుల ముందే చెప్పారు. జగన్‌ అక్రమాలను నమ్మి వాటితోనే ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని అవకతవకలకు పాల్పడాలో అన్నీ చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు మాట్లాడితే కేసులు పెట్టించి వేధించారు. ఐదో తరగతి చదివిన వ్యక్తికీ ఓటు హక్కు కల్పించారు. ఓటుకు రూ.10వేలు, వెండి నగలిచ్చి మభ్యపెట్టారు. టీడీపీ ప్రచారం నిర్వహించకుండా అడ్డంకులు సృష్టించారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు నివారించడం పెద్ద సమస్యగా మారింది. కౌంటింగ్‌లో హాలులోనూ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎన్నికల కౌంటింగ్‌ రోజు పులివెందుల నుంచి మనుషులను పంపారు. చివరకు టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించినా డిక్లరేషన్‌ ఇవ్వలేదు. రీకౌంటింగ్‌ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఓటమిని అంగీకరించలేని పరిస్థితి వైసీపీది. మీ పని అయిపోయింది. ఇకపై మీ ఆటలు సాగబోవని చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ తిరుగుబాటు ప్రారంభమైంది. నేరాల్లో అధికారులను భాగస్వామ్యం చేస్తున్నారు. వైసీపీపాలనలో కార్యనిర్వాహక వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొంది. సీఎస్‌తో సహా అధికారులకు కోర్టులు చీవాట్లు పెట్టే స్థితి వచ్చింది. శాసనసభ, మండలిని ప్రహసనంగా మార్చారు. కోర్టులు, జడ్జిలను బ్లాక్‌ మెయిల్‌ చేసే విధంగా ప్రవర్తించారు. జగన్‌ను నమ్ముకున్నవారిని జైలుకు పంపారు. రాష్ట్రంలో నాలుగు వ్యవస్థలు పనిచేయడం లేదు. దాదాపు 108 నియోజకవర్గాల పరిధిలోని 10లక్షలకు పైగా ఓటర్లు ఛీకొట్టినా సజ్జలకు బుద్ధి రాలేదు. ప్రజలను అవమానించేలా ఒక సెక్షనే ఓట్లు వేశారని వ్యాఖ్యలు చేశారు. వారికి మేం ఏమీ చేయలేదని ఒప్పుకున్నందుకు సంతోషం. జనం కూడా ఫ్యాన్‌ పని అయిపోయిందని అంటున్నారు. ప్రజలు తెలివైన వారు. అన్ని విషయాల్లో చైతన్యవంతులు. సరైన నిర్ణయం తీసుకుని వైసీపీ వాళ్లను ఎక్కడపెట్టాలో అక్కడ పెడతారు. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న ఇలాంటి ప్రమాదకరమైన ప్రభుత్వాన్ని ఉపేక్షిస్తే అది అందరికీ ప్రమాదమే అన్న విషయం గుర్తుంచుకోవాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌, ఇతర పార్టీలతో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చాక, రెండో ప్రాధాన్యత ఓటులో పరస్పరం సహకరించుకున్నాం. ఈ విషయంలో సీపీఐ, సీపీఎంను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, నిమ్మకాయల చినరాజప్ప, వర్ల రామయ్య, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img