కేంద్రమంత్రి మాన్షుఖ్ మాండవీయ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆరోగ్య కార్యకర్తలు అంతా కలిసి పని చేసి ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుఖ్ మాండవీయ అన్నారు. సోమవారం దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉంచడంలో అందరూ వాటాదారులేనని అన్నారు. దేశంలో రాబోయే 25 ఏళ్లలో ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి రోడ్మ్యాప్ను సైతం సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉంచే బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిదా, రాష్ట్ర ప్రభుత్వానిదా? నిజానికి ఈ రెండు ప్రభుత్వాలది. వీరితో పాటు ఆరోగ్య కార్యకర్తలది కూడా. ఈ విషయంలో మనమందరం వాటాదారులమే. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు మరింత విస్తృతంగా అందించాల్సిన అవసరం ఉంది. దాని కోసం కలిసి పని చేద్దాం’’ అని కేంద్ర మంత్రి మాన్షుఖ్ అన్నారు.